అమెరికాతో తాము సత్సంబంధాలనే కోరుకుంటున్నామని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి కీలక ప్రకటన చేశారు. కేవలం అమెరికాతో మాత్రమే కాకుండా… ప్రపంచ దేశాలన్నింటితోనూ తాము సత్సంబంధాలనే నెరుపుతామని తాలిబాన్ ప్రభుత్వ హోంమంత్రి సిరాజుద్దీన్ హక్కానీ మంగళవారం కీలక ప్రకటన చేశారు.
గత 20 ఏళ్లుగా తాము యుద్ధాలు, రక్షణ రంగం అంటూ గడిపేశామని గుర్తు చేసుకున్నారు. దోహా ఒప్పందం తర్వాత వాటి గురించి మాట్లాడొద్దని నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. ఇకపై వాటి ఊసే ఎత్తమని, అమెరికాతో సహా అన్ని దేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నామని ఆయన వెల్లడించారు.
బాలికలకు విద్య అన్న విషయంపై హక్కానీ కీలక ప్రకటన చేశారు. బాలికలకు విద్యా సదుపాయం కల్పించే విషయంలో అతి తొందర్లోనే ఓ మంచి నిర్ణయం తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఓ పద్ధతి ప్రకారం ఈ విషయంపై వ్యవహరిస్తామని, స్త్రీ, పురుషులిద్దరికీ విద్య కావాలన్నదే తమ అభిమతమని సిరాజుద్దీన్ హక్కానీ స్పష్టం చేశారు.