ఇస్లామాబాద్: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి 8 గంటల తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. తొలుత ఇవాళ ఉదయం సభ మధ్యాహ్నం వాయిదా పడింది. మళ్లీ మధ్యాహ్నం 2.30 నిమిషాల తర్వాత సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి ప్రసంగిస్తున్నారు. ఇవాళ రాత్రి ఇఫ్తార్ విందు ముగిసిన తర్వాత అవిశ్వాసంపై ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నట్లు కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
మిస్సైల్ ప్రమాదం..
మంత్రి ఖురేషి తన ప్రసంగంలో మిస్సైల్ ప్రమాదం గురించి ప్రస్తావించారు. ఇండియా ఓ మిస్సైల్ను పరీక్షించిందని, అది పాకిస్థాన్ భూభాగంలోకి చేరిందని, కానీ ఇండియా మాత్రం ఆ ప్రయోగం ప్రమాదవశాత్తు జరిగినట్లు చెప్పిందన్నారు. నిజానికి ప్రాణ నష్టం జరగలేదు. కానీ వాళ్లను వివరణ అడిగితే అది ప్రమాదం అన్నారన్నారు. ఇదే విషయాన్ని యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్లో ఇండియా ఒప్పుకుంటుందా అని ఆయన ప్రశ్నించారు. ప్రమాదవశాత్తు జరిగిన మిస్సైల్ పరీక్ష గురించి యూఎన్కు లేఖ రాశామని, ఇండియా చాలా ప్రాణాంతక గేమ్ ఆడిందన్నారు. స్టాండర్డ్ ఆపరేటింగ్ పద్ధతులు ఎక్కడ ఉన్నాయని, ప్రోటోకాల్స్ ఎక్కడ ఉన్నాయని ఆయన అడిగారు.