Volodymyr Zelenskyy : రష్యా-ఉక్రెయిన్ (Ukraine-Russia) దేశాల మధ్య కాల్పుల విరమణకు ప్రయత్నాలు జరుగుతున్న తరుణంలో పుతిన్ (Putin) సేనలు ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్నాయి. సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో (Mascow) సీజ్ చేసింది. ఈ నేపథ్యంలో రష్యా దండయాత్రను ఆపడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు (Ukraine president) వ్లాదిమిర్ జెలెన్స్కీ (Zelenskyy) తాజాగా కీలక ప్రతిపాదన చేశారు.
ద్వైపాక్షిక చర్చలు పుతిన్కు ఇష్టం లేకపోతే.. త్రైపాక్షిక చర్చలైనా పర్వాలేదన్నారు. ఏ తరహా సమావేశానికైనా తాను సిద్ధమేనని జెలెన్స్కీ స్పష్టంచేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలోనైనా శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నాననే ఉద్దేశంతో జెలెన్స్కీ ఈ ప్రతిపాదన చేశారు. శాంతి ఒప్పందానికి రాకుండా ముందుకు వెళ్తున్న రష్యాపై అమెరికా ఆంక్షలు విధించాలని డిమాండ్ చేశారు.
కాగా పుతిన్ దూకుడుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆయన నిప్పుతో ఆడుకుంటున్నారని అన్నారు. తాను లేకుండా ఉండి ఉంటే రష్యాకు చాలా చెడు జరిగేదని, చాలాచాలా నష్టం జరిగి ఉండేదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని పుతిన్ తెలుసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇటీవల ఉక్రెయిన్పై రష్యా చేసిన అతిపెద్ద వైమానిక దాడిపై కూడా ట్రంప్ తీవ్రంగా స్పందించారు. పుతిన్తో తనకు మంచి సంబంధాలే ఉన్నాయని, కానీ కొన్నిసార్లు ఆయనకు ఏమవుతుందో అర్థం కావట్లేదని అన్నారు.
కొన్నిసార్లు పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అవసరం లేకపోయినా చాలామందిని చంపేస్తున్నారని, ఇక్కడ తాను కేవలం సైనికుల గురించే మాట్లాడట్లేదని అన్నారు. కారణం లేకపోయినా ఉక్రెయిన్ నగరాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నారని విమర్శించారు. ఆయన ఉక్రెయిన్లో కొంత భూభాగాన్ని మాత్రమే కాదు, ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. పుతిన్ దృష్టిలో అది సరైనదే కావచ్చని, కానీ అది రష్యా పతనానికే దారితీస్తుందని ట్రంప్ హెచ్చరించారు.