వాషింగ్టన్, జనవరి 14: అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామిపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయనకు ఓటు వేయవద్దని తన మద్దతుదారులను కోరారు. వివేక్ రామస్వామి అవినీతి పరుడని, ఆర్థిక నేరగాడని ట్రంప్ ఆరోపించారు. మోసపూరిత ప్రచారాలతో తన అనుచరుల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని విమర్శించారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి వివేక్ రామస్వామి, ట్రంప్ మధ్య ఇప్పటివరకు స్నేహపూర్వక పోటీ సాగింది. ‘ట్రూత్ సోషల్ పోస్ట్’లో ట్రంప్ చేసిన విమర్శలపై వివేక్ స్పందిస్తూ, ‘ఎన్నికల సలహాదారుల మాట విని ట్రంప్ నాపై ఆరోపణలు చేయటం దురదృష్టకరం. దీనికి ప్రతిగా ఆయనపై మాటల దాడికి దిగదలుచుకోలేదు’ అని అన్నారు.