USTR : భారత్, అమెరికా (India, US) దేశాల మధ్య ప్రతిపాదిత ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీ (New Delhi) లో కీలకమైన ఉన్నత స్థాయి చర్చలు జరుగుతున్న వేళ.. భారత్కు అమెరికా ఊహించని షాకిచ్చింది. భారతదేశంలో అన్యాయమైన వాణిజ్య పద్ధతులు (Unfair trade practices) కొనసాగుతున్నాయని ఆరోపిస్తూ.. ‘యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ (USTR)’ కార్యాలయం భారత్ను దోషుల జాబితాలో చేర్చింది. భారత్ నుంచి అమెరికాకు వెళ్లే వివిధ రకాల దిగుమతులపై 10 శాతం నుంచి 12.5 శాతం వరకు అదనపు సుంకాలను (Additional Tariffs) విధించాలని ప్రతిపాదించింది.
అమెరికా ట్రేడ్ యాక్ట్ 1974 లోని ‘సెక్షన్ 301’ కింద నిర్వహించిన 60 సుదీర్ఘ దర్యాప్తుల ఫలితాలను యూఎస్టీఆర్ అధికారికంగా విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 54 ఆర్థిక వ్యవస్థలలో ‘బలవంతపు శ్రమ (Forced Labour)’ ద్వారా తయారయ్యే వస్తువుల దిగుమతులను సమర్థవంతంగా నిషేధించడానికి లేదా నిరోధించడానికి తగినంత కఠినమైన చర్యలు లేవని అమెరికా తన నివేదికలో స్పష్టంచేసింది. ఈ 54 దేశాల జాబితాలోనే భారతదేశాన్ని కూడా చేర్చడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ అంబాసిడర్ జామీసన్ గ్రీర్ ఈ విషయంపై మాట్లాడుతూ.. ‘మా అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాములు బలవంతపు శ్రమతో తయారైన వస్తువుల దిగుమతుల సమస్యను పరిష్కరించడంలో విఫలం కావడం అంగీకరించలేనిది. దీనివల్ల అమెరికా కార్మికులు ప్రపంచవ్యాప్తంగా అసమానమైన, అన్యాయమైన వాతావరణంలో పోటీ పడాల్సి వస్తోంది’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.