వాషింగ్టన్, నవంబర్ 19: జర్నలిస్టు జమాల్ ఖషోగ్గీ హత్య కేసుల విచారణ నుంచి సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్కు అమెరికా రక్షణ కల్పించింది. ఈ నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తడంతో ఎందుకు రక్షణ కల్పించాల్సి వచ్చిందో వివరణ ఇచ్చింది. అందుకు భారత ప్రధాని నరేంద్ర మోదీని ఉదహరించింది. ‘సౌదీ యువరాజు ప్రస్తుతం ఆ దేశ ప్రధాని హోదాలో ఉన్నారు. గతంలోనూ అనేక దేశాధినేతలకు ఇది వర్తించింది. సుదీర్ఘ, నిరంతర ప్రక్రియ ఇది. ఉదాహరణకు 1993లో అప్పటి హైతీ అధ్యక్షుడు అరిైస్టెడ్, 2001లో జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే, 2014లో భారత ప్రధాని మోదీ, 2018లో కాంగో అధ్యక్షుడు జోసెఫ్ కబీలాకు ఈ రక్షణ లభించింది. దేశాధినేతలు, విదేశాంగ మంత్రులకు ఈ రక్షణ కల్పిస్తున్నాం’ అని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ వివరించారు. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు 2002లో ఆ రాష్ట్రంలో గోద్రా అల్లర్లు జరిగాయి. ఆ అల్లర్లను అడ్డుకొనేందుకు మోదీ సర్కారు ఎలాంటి ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలపై 2005లో మోదీ వీసాపై అమెరికా నిషేధం విధించింది. 2014లో ఆయన ప్రధాని అయ్యే వరకు ఈ నిషేధం కొనసాగింది.