JD Vance : భారత మూలాలున్న తన అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీవాన్స్ (JD Vance) ప్రశంసలు కురిపించారు. అమెరికాను సుసంపన్నం చేయడంలో, అమెరికా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో వారు ఒక నిదర్శనంగా నిలిచారని అన్నారు. జార్జియా యూనివర్సిటీ (Georgia University) లో జరిగిన ఓ కార్యక్రమంలో జేడీ వాన్స్ మాట్లాడుతూ.. అమెరికా ఆర్థికవ్యవస్థను బలోపేతం చేయడంలో వలసదారులు కీలక పాత్ర పోషిస్తున్నారని చెప్పారు. అదే సమయంలో వలస విధానాలపై అమెరికా కఠిన నియంత్రణనూ ఆయన సమర్థించారు.
అమెరికా పౌరసత్వం పొందడం అంటే ఈ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వడమేనని జేడీ వాన్స్ స్పష్టంచేశారు. అయితే హెచ్-1బీ వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను భారత్ నుంచి వలస వచ్చిన కుటుంబానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నానని, తనకు తన అత్తమామలంటే చాలా ఇష్టమని, ఎందుకంటే వాళ్లు చాలా గొప్ప వ్యక్తులని, వాళ్లు అమెరికాకు ఎంతో సేవ చేశారని అన్నారు. భారత్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని, ఈ దేశ పౌరుడిగా మారిన తన మామగారు.. అమెరికా ప్రయోజనాల కోసమే పాటుపడ్డారని తెలిపారు.
హెచ్-1బీ వీసాలపై అమెరికాలో నివసిస్తున్నవారు గ్రీన్కార్డ్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందంటూ భారత సంతతి వ్యక్తి ఒకరు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా బదులిచ్చారు. కాగా వాన్స్ భార్య ఉషా చిలుకూరి అమెరికాలో కాలిఫోర్నియాలోని శాండియాగో ప్రాంతంలో పుట్టి పెరిగిన తెలుగమ్మాయి. ఆమె పూర్వీకులది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా పామర్రుకి దగ్గర్లోని ఓ కుగ్రామం. తల్లిదండ్రులు రాధాకృష్ణ, లక్ష్మి 1980ల్లోనే అమెరికాకు వలస వెళ్లారు. వాళ్ల ముగ్గురు సంతానంలో ఉష ఒకరు.