వాషింగ్టన్: చైనాకు అమెరికా ధీటుగా సమాధానం ఇచ్చింది. ఆ దేశానికి 44 ప్యాసింజర్ విమానాలను నిలిపివేసింది. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారం తమ దేశంలోకి ప్రవేశంపై చైనా కఠినమైన నియంత్రణలు అమలు చేస్తున్నది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న దేశాలతోపాటు, ఆయా దేశాల్లో ఆగే “సర్క్యూట్ బ్రేకర్” విధానం వల్ల పలు అమెరికా విమానాలను రద్దు చేసింది. టేకాఫ్కి ముందు కోవిడ్ నెగెటివ్గా పరీక్షించిన ప్రయాణికులు చైనాకు చేరుకున్న తర్వాత పాజిటివ్గా తేలినప్పుడు సర్క్యూట్ బ్రేకర్ విధానాన్ని చైనా ఏవియేషన్ అథారిటీ వినియోగిస్తున్నది. ఇందులో భాగంగా అమెరికన్, డెల్టా, యునైటెడ్ ఎయిర్లైన్స్కు చెందిన పలు విమాన సర్వీసులను చైనా రద్దు చేసింది.
ఈ నేపథ్యంలో అమెరికా కూడా ప్రతీకార చర్యలు చేపట్టింది. చైనా విమానయాన సంస్థలకు చెందిన పలు ప్రయాణికుల విమానాలను రద్దు చేసింది. ఎయిర్ చైనా, చైనా ఈస్టర్న్ ఎయిర్లైన్స్, చైనా సదరన్ ఎయిర్లైన్స్, జియామెన్ ఎయిర్లైన్స్ ద్వారా జనవరి 30 నుంచి మార్చి 29 మధ్య అమెరికా నుంచి బయలుదేరే 44 విమానాలను రద్దు చేసినట్లు శుక్రవారం పేర్కొంది.
మరోవైపు చైనాలో శీతాకాల ఒలింపిక్స్ ప్రారంభానికి ముందు ఆ దేశంలో కరోనా నియంత్రణకు కఠిన విధానాలు అమలు చేస్తున్నారు. ఇప్పటికే పలు పశ్చిమ దేశాలు ఈ ఒలింపిక్స్ను బహిష్కరించాయి. ఈ తరుణంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది.