న్యూయార్క్: కరోనా వైరస్ వల్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 8 లక్షలు దాటింది. మహమ్మారి కరోనా వల్ల అత్యధిక స్థాయిలో మరణాలు సంభవించింది అమెరికాలోనే. ఇక సోమవారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఆ దేశంలో 50 మిలియన్లకు చేరుకున్నది. వ్యాక్సిన్ వేసుకోనివారిలో, వృద్ధుల్లో ఎక్కువ శాతం మరణాలు నమోదు అయినట్లు తెలస్తోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాదే ఎక్కువ మంది అమెరికన్లు మృతిచెందినట్లు డేటా చెబుతోంది. ఇంకా ఇప్పటికి కూడా ఆ దేశంలో కరోనా మరణాల రేటు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. గడిచిన 11 వారాల్లోనే లక్ష మందికిపైగా కరోనా వల్ల ప్రాణాలను కోల్పోయారు. ఇది గత ఏడాది వింటర్ సీజన్తో పోలిస్తే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. 650 రోజుల క్రితం అమెరికాలో తొలి కోవిడ్ మరణం నమోదు అయినట్లు అధికారులు చెప్పారు.
ప్రస్తుతం అమెరికాలో ఫైజర్, మోడెర్నా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంతో పోలిస్తే అమెరికాలో కరోనా మరణాలు రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు నిపుణులు అంచనా వేశారు. అమెరికా తర్వాత అత్యధిక మరణాలు సంభవించిన దేశాల్లో బ్రెజిల్ ఉంది. అక్కడ 6,16,000 మంది మృతిచెందారు. ఇండియాలో కరోనా వల్ల మృతిచెందిన వారి సంఖ్య 4,75000గా ఉంది.