వాషింగ్టన్, మార్చి 27 : ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోతున్నది. యుద్ధం ప్రారంభమైన తొలి వారంలోనే ఏకంగా 11.3 బిలియన్ డాలర్లను (సుమారు రూ.1.07 లక్షల కోట్లు) అమెరికా వెచ్చించింది. రోజుకు సగటున 2 బిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నది. యుద్ధం కోసం మరో 200 బిలియన్ డాలర్లు ( సుమారు రూ.18.9 లక్షల కోట్లు) ఇవ్వాలని ఇటీవలే పెంటగాన్ వైట్హౌస్ని కోరింది. మరోవైపు ఆయుధ నిల్వలు కరిగిపోతున్నాయి. ఇరాన్ దాడులతో గల్ఫ్లోని అమెరికా బేస్లకు భారీ నష్టం వాటిల్లింది. మొత్తంగా ఈ యుద్ధం అమెరికాకు మోయలేని భారంగా మారుతున్నదని నిపుణులు పేర్కొంటున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో ఉక్రెయిన్ రక్షణ కోసం కేటాయించిన ఆయుధాలను అమెరికా దారి మళ్లించి ఇరాన్పై యుద్ధంలో వినియోగించాలని యోచిస్తున్నది. 28 రోజులుగా ఇరాన్తో జరుగుతున్న యుద్ధం కారణంగా, ఇప్పటికే అమెరికా అత్యంత విలువైన, అరుదైన ఆయుధ సామగ్రి నిల్వలు ఆయుధగారం నుంచి కరిగిపోయాయన్న పెంటగాన్ ఆందోళనలను వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. ఈ విషయంపై పెంటగాన్లో నిజమైన చర్చ జరుగుతున్నదని, దీనితో సంబంధమున్న ముగ్గురు కీలక వ్యక్తులను ఉటంకిస్తూ పేర్కొన్నది. దారి మళ్లించాలనుకుంటున్న వాటిలో ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ క్షిపణులు, మరికొన్ని విలువైన ఆయుధాలు ఉన్నాయి.
నాటో కూటమి సమిష్టి నిర్ణయం మేరకు ఇవన్నీ ఉక్రెయిన్కు సరఫరా చేయడానికి అమెరికా కొన్ని సంస్థలకు ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. ఇవన్నీ కీవ్కు తరలించాల్సి ఉండగా, ఇరాన్ యుద్ధం రావడంతో వాటినన్నింటినీ అమెరికా వాడాలని యోచిస్తున్నది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ నాలుగు వారాల్లో యూఎస్ సెంట్రల్ కమాండ్ 9,000 లక్ష్యాలను ఛేదించిందంటే వారి ఆయుధ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. కాగా, తాము రష్యాతో నాలుగేండ్లుగా జరుపుతున్న యుద్ధంలో వినియోగించిన దాని కన్నా అమెరికా, దాని మిత్ర దేశాలు కేవలం మూడు రోజుల వ్యవధిలో 800 పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణులు ప్రయోగించాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వాపోయారు.