వాషింగ్టన్: ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు చెందిన ఎఫ్-22 యుద్ధ విమానాలపై చైనా జెండాలు అమర్చి రష్యాపై బాంబులు వేయాలని అన్నారు. ఆ తర్వాత చైనానే ఆ పని చేసిందని అమెరికా చెప్పాలని, దీంతో రష్యా, చైనా పోట్లాడుకుంటే మనం ఎంచక్కా కూర్చొని చూడవచ్చంటూ హస్యమాడారు. శనివారం జరిగిన రిపబ్లికన్ జాతీయ కమిటీ అగ్ర దాతల సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో సభలోని వారంతా నవ్వడంతోపాటు చప్పట్లు కొట్టారు.
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రిపబ్లికన్ సెనేటర్ల వ్యాఖ్యలు, బాధ్యతా రహిత చర్యలపై విమర్శలు వస్తున్నాయి. ఉక్రెయిన్కు అమెరికా దళాలను పంపడాన్ని పూర్తిగా తోసిపుచ్చలేమని రిపబ్లికన్ సెనేటర్ రిక్ స్కాట్ ఒక ఇంటర్వ్యూలో అన్నారు. దీనిపై పెద్ద దుమారం చెలరేగింది. ఈ నేపథ్యంలో తొలుత పుతిన్ను సమర్థించిన ట్రంప్, తాజాగా బైడెన్పై మండిపడ్డారు.
రష్యా అణు శక్తి కావడంతో దాడి చేయలేమని చెప్పడం బైడెన్ మానేయాలని ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఎవరు చేసినప్పటికీ సరైనవా? అని ప్రశ్నించారు. రష్యా అణు శక్తి అని మనకు చెప్పినందుకు ధన్యవాదాలు అని ఎద్దేవా చేశారు. నాటోను ‘కాగితపు పులి’గా ఆయన అభివర్ణించారు. మానవాళికి వ్యతిరేకంగా జరిగిన ఈ భారీ నేరాన్ని ఎదుర్కొనేందుకు నాటో దేశాలు ముందుకు రాకపోవడంపై మండిపడ్డారు. ఇలాంటివి తాము జరుగనివ్వబోమని, తాము అనుమతించబోమని అన్నారు.
తాను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరో దేశంపై రష్యా ఎలాంటి దురాక్రమణలకు పాల్పడలేదని ట్రంప్ గుర్తు చేశారు. ‘బుష్ ఆధ్వర్యంలో జార్జియాపై రష్యా దాడి చేసింది. ఒబామా హయాంలో క్రిమియాను రష్యా స్వాధీనం చేసుకుంది. తాజాగా బైడెన్ ఆధ్వర్యంలో ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగింది’ అని వ్యాఖ్యానించారు.