వాషింగ్టన్, అక్టోబర్ 22: అమెరికాలో విదేశీ ఉద్యోగులకు జారీచేసే హెచ్-1బీ వీసా ప్రక్రియలో మార్పులు చేయాలని బైడెన్ ప్రభుత్వం భావిస్తున్నది. దీనిలో భాగంగా ఆ వీసాలకు సంబంధించిన అర్హతా ప్రమాణాలను సరళీకరించి వాటి జారీ ప్రక్రియ సామర్థ్యాన్ని మెరుగుపర్చాలని యోచిస్తున్నది. దీనితోపాటు ఎఫ్-1 వీసా విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు, లాభాపేక్షలేని సంస్థల తరఫున పనిచేసేవారికి, వలసేతర కార్మికులకు వర్తించేలా సరళీకృత నిబంధనలను తీసుకురానున్నది.
అయితే ఏటా జారీచేసే 60 వేల వీసాల పరిమితిలో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త నిబంధనలను అమెరికా పౌరసత్వ, వలస సేవల (యూఎస్సీఐఎస్) విభాగం ఈ నెల 23న ఫెడరల్ రిజిస్టర్లో ప్రచురించనున్నది. దీంతో లాటరీలో వీసాను దక్కించుకునేందుకు ఒకే వ్యక్తి పలుమార్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ దేశాల్లోని ప్రతిభావంతులను అమెరికాకు ఆకర్షించడం, ఉద్యోగులు, యాజమాన్యాలపై భారాన్ని తగ్గించడం, హెచ్-1బీ వీసా జారీలో పారదర్శకతను పెంపొందించడం కోసం ఈ ప్రతిపాదనలు చేశారు.