వాషింగ్టన్: హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్లో ఇవాళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) పర్యటించనున్నారు. బుధవారం అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లనున్నారని అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సోమవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ పర్యటన అనంతరం బైడెన్ జోర్డాన్ వెళ్తాడని, అక్కడ ఈజిప్ట్, పాలస్తీనా, జోర్డాన్ దేశాధినేతలతో ఆయన సమావేశం అవుతారని వైట్హౌస్ తెలిపింది.
కాగా, హమాస్ తీవ్రవాద దాడిని ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్కు తన బలమైన మద్దతును ప్రదర్శించడమే ఆ దేశంలో బైడెన్ పర్యటన ప్రధాన ఉద్దేశమని వైట్హౌస్ తన ప్రకటనలో పేర్కొంది. యుద్ధం నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపైనా ఇజ్రాయెల్తో చర్చించనున్నట్లు వెల్లడించింది. ఇజ్రాయెల్ టూర్ అనంతరం జోర్డాన్ రాజధాని అమ్మన్కు బైడెన్ వెళ్తారని తెలిపింది. అక్కడ జోర్డాన్ రాజు అబ్దుల్లా, ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతే అల్- సిసీ, పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్తో సమావేశమవుతారని పేర్కొంది.
పాలస్తీనా ప్రజల గౌరవం, స్వీయ నిర్ణయాధికారాన్ని హమాస్ ప్రతిబింబించదని బైడెన్ ఈ భేటీలో పునరుద్ఘాటించనున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. అలాగే గాజా (GAZA)లోని మానవతా సంక్షోభ నివారణ గురించీ బైడెన్ చర్చిస్తారని పేర్కొంది. కాగా, ఇప్పటికే బైడెన్ ఈజిప్ట్ అధ్యక్షుడితో పాటు ఇరాక్ ప్రధాని మహమ్మద్ శియా అల్- సుడానీతో ఫోన్లో మాట్లాడారు. హమాస్ దాడి తర్వాత ఆ ప్రాంతంలో పరిస్థితులపై ఆరా తీశారు. పరిస్థితులు మరింత దిగజారకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా దేశాధినేతలు వెల్లడించారు.
గాజాలో మానవతా సంక్షోభం, దాని నివారణకు ఐరాస సమన్వయంతో చేపడుతున్న చర్యలపైనా చర్చించారు. మరోవైపు హమాస్ మిలిటెంట్లకు అండగా నిలుస్తున్న ఇరాన్కు మాత్రం బైడెన్ పర్యటన తీవ్ర ఆగ్రహం తెప్పించే అంశంగా మారింది. మరోవైపు గాజాలో బందీలను విడిచిపెట్టాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హమాస్ కు విజ్ఞప్తి చేశారు. మానవతా సాయాన్ని అడ్డుకోవద్దని ఇటు ఇజ్రాయెల్కూ సూచించారు.