వాషింగ్టన్, ఫిబ్రవరి 11 : ఒక పక్క దౌత్య మార్గాల ద్వారా ప్రయత్నాలు సాగిస్తూనే ఏ క్షణంలోనైనా ఇరాన్పై దాడి చేయడానికి అగ్రరాజ్యం అమెరికా అన్ని విధాల సన్నద్ధమవుతున్నది. జనవరి నుంచి ఇరాన్తో ఉద్రిక్తతలు పెరుగడంతో పశ్చిమాసియాలో అతి పెద్ద సైనిక కేంద్రమైన ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా దళాలు పేట్రియాట్ క్షిపణులను మొబైల్ ట్రాక్ లాంచర్లలోకి ఎక్కించి తరలించాయి.
ఈ విషయం ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ ద్వారా వెల్లడైంది. సెమీ స్టాటిక్ లాంచర్ స్టేషన్లలో ఉంచకుండా ఈ క్షిపణులను మొబైల్ లాంచర్లలోకి లోడ్ చేయడం అమెరికా యుద్ధ సన్నాహాల వేగవంతాన్ని తెలియజేస్తున్నదని నిపుణులు భావిస్తున్నారు. జనవరి నాటి ఉపగ్రహ చిత్రాలతో ఫిబ్రవరి చిత్రాలను సరిపోల్చి చూస్తే ఈ ప్రాంతంలో విమానాలు, ఇతర మిలిటరీ సామగ్రి మోహరింపు అధికం కావడాన్ని గమనించవచ్చునని ఉపగ్రహ చిత్రాల ఫోరెన్సిక్ విశ్లేషకుడు విలియమ్ గూడ్హిండ్ వెల్లడించారు.