వాషింగ్టన్: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్పై రష్యా దాడికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధంలో ఇప్పటి వరకు రెండు లక్షల మంది సైనికులు చనిపోయి ఉంటారని అమెరికా అంచనా వేసింది. రష్యా వైపున లక్ష మంది, ఉక్రెయిన్ వైపున లక్ష మంది సైనికులు మృతిచెంది ఉంటారని లేదా గాయపడి ఉంటారని అమెరికా జనరల్ వెల్లడించారు.
అమెరికా సంయుక్త దళాల చీఫ్ జనరల్ మార్క్ మిల్లే ఈ విషయాన్ని తెలిపారు. ఉక్రెయిన్ వార్లో సుమారు 40 వేల మంది పౌరులు కూడా మృతిచెంది ఉంటారని ఆయన అంచనా వేశారు. అయితే ఇంత భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు పశ్చిమ దేశాలు అంచనా వేయడం ఇదే తొలిసారి. భారీ ప్రాణ నష్టం నేపథ్యంలో రష్యాతో చర్చలు నిర్వహించేందుకు కీవ్ ఆసక్తిగా ఉన్నట్లు కూడా ఆయన చెప్పారు.
అధ్యక్షుడు జో బైడెన్కు సీనియర్ మిలిటరీ సలహాదారుగా ఉన్న జనరల్ మార్క్ మిల్లే కొన్ని సందేహాలు కూడా వ్యక్తం చేశారు. ప్రాణ నష్టం ఎక్కువగా ఉన్న కారణంగా.. రాబోయేది శీతాకాలం కావడంతో.. రెండు దేశాలు చర్చలపై ఆసక్తి చూపనున్నట్లు వెల్లడించారు. శీతాకాలంలో అక్కడ చలి తీవ్రంగా ఉంటుందని, మంచు ఏర్పడుతుందని, దీంతో యుద్ధం చేయడం కష్టంగా మారుతుందని ఆయన అన్నారు.
యుద్ధంలో సుమారు లక్ష మంది రష్యా సైనికులు చనిపోయి ఉంటారని, లేదా గాయపడి ఉంటారన్నారు. ఇక ఉక్రెయిన్ వైపున కూడా ఇలాంటి నష్టమే జరిగి ఉంటుందని జనరల్ మిల్లే అంచనా వేశారు. ఉక్రెయిన్ వార్లో కేవలం 5937 మంది సైనికులు చనిపోయినట్లు రష్యా చివరిసారి సెప్టెంబర్లో ప్రకటన చేసింది.