వాషింగ్టన్: అమెరికాలో డెల్టా కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఆసుపత్రులన్నీ కరోనా రోగులతో నిండిపోతున్నాయి. టెక్సాస్ రాజధాని నగరం ఆస్టిన్లో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది. నగరంలో 24 లక్షల జనాభా ఉండగా శనివారం నాటికి అక్కడి ఆసుపత్రుల్లో కేవలం 6 ఐసీయూ బెడ్లు మాత్రమే మిగిలాయి. 313 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు టెక్సాస్ రాష్ట్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కరోనా పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నదని, బెడ్స్ కొరత వల్ల ఆసుపత్రులపై ఒత్తిడి పెరిగిందని పబ్లిక్ హెల్త్ మెడికల్ డైరెక్టర్ డెస్మార్ వాక్స్ వెల్లడించారు. విపత్తు పొంచి ఉన్నదంటూ ఎస్ఎంఎస్, ఈ మొయిల్స్, ఫోన్ల ద్వారా పౌరులను హెచ్చరించారు.
ఆస్టిన్ నగరంలో డెల్టా వేరియంట్ కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో గత నెల రోజులుగా ఆసుపత్రులలో కొత్త అడ్మిషన్లు 600 శాతంపైగా పెరిగింది. ఐసీయూ వార్డుల్లో చేరే రోగుల సంఖ్య కూడా 570 శాతం దాటింది. వెంటిలేటర్పై ఉన్న కరోనా రోగుల సంఖ్య జూలై 4న ఎనిమిది ఉండగా శనివారం నాటికి 102కు పెరిగింది. ఆస్టిన్ నగరంలో కరోనా కేసులు పది రెట్లు పెరుగడంతో గరిష్ఠ ప్రమాద స్థాయి 5వ దశకు చేరుకున్నట్లు రెండు రోజుల కిందటే నగర ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఈ నేపథ్యంలో కరోనా టీకాలు తీసుకోవాలని, ఇండ్లలోనే ఉండాలని, వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ మాస్కులు ధరించాలని ప్రజలకు సూచించారు. మరోవైపు అమెరికా వ్యాప్తంగా రోజువారీ కరోనా కేసుల నమోదు లక్ష దాటింది.