వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో నగరంలో ఆదివారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా, 9 మంది గాయపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే శాక్రమెంటో పోలీసులు పెద్ద సంఖ్యలో కాల్పులు జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.
మరోవైపు భారీగా కాల్పుల శబ్ధం వినిపిస్తుండగా అక్కడున్న ప్రజలు పరుగులు తీస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనంతరం పదుల సంఖ్యలో అంబులెన్స్లు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. కాల్పుల్లో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.