వాషింగ్టన్: ఇరాన్పై యుద్ధాన్ని(Iran Crisis) ఆపేందుకు ట్రంప్ 15 షరతులు విధించిన విషయం తెలిసిందే. శాంతి కుదరాలంటే ఆ ఒప్పందాలను అంగీకరించాలన్నారు. కానీ ఇరాన్ మాత్రం ఆ చర్చలను తిరస్కరిస్తున్నది. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేయడానికి పూర్వమే ఓ హిట్ లిస్టును తయారు చేసుకున్నారు. ఇరానీ కీలక నేతల్ని ఏరివేసే ప్లాన్తో అమెరికా దళాలు ముందుకు వెళ్లాయి. అనుకున్నట్లే ఖమేనీతో పాటు మరికొంత మందిని హతమార్చారు. అయితే ఇరానీ నేతలకు చెందిన హిట్ లిస్టు నుంచి ఇద్దరి పేర్లను తొలగించినట్లు అమెరికా చెబుతోంది.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచీ, పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ భగేర్ గలీబఫ్ పేర్లను తాత్కాలికంగా హిట్ లిస్టు నుంచి తొలగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇరాన్తో శాంతి చర్చలు నిర్వహించే ఉద్దేశంతో ఆ ఇద్దరు నేతల్ని వదిలేసినట్లు అమెరికా పేర్కొన్నది. వాస్తవానికి అమెరికాతో డీల్ కుదుర్చుకోవాలని ఇరాన్ ఆసక్తిగా ఉందని, కానీ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుందేమో అన్న భయంతో చర్చలకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోందని ట్రంప్ అన్నారు. స్వంత ప్రజలు చంపుతారేమో అన్న భయంతో వాళ్లు చర్చలకు రావడం లేదన్నారు. కానీ ట్రంప్ తన వ్యాఖ్యల్లో ఆ ఇద్దరి నేతల పేర్లను మాత్రం వెల్లడించలేదు.
అమెరికాతో చర్చలు జరగడం లేదని ఇరాన్ మంత్రి అబ్బాస్ అరగాచి తెలిపారు. మిత్ర దేశాల నుంచి తమకు మెసేజ్లు వస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ చేస్తున్న ప్రకటనలు, వార్నింగ్లు.. చర్చలు, దౌత్యం కిందకు రావు అని అన్నారు. ఇరాన్, అమెరికా మధ్య చర్చల వాతావరణం కనిపిస్తున్నదని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ తెలిపారు. శాంతి కుదిరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందన్నారు.