JME | జెనీవా: చిన్నపిల్లల్లో పోషకాహార లోపం వల్ల సంభవించే దుష్పరిణామాలను అధిగమించేందుకు ఎంచుకున్న లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రపంచ దేశాలు చాలా దూరంలోనే నిలిచిపోయాయని తాజాగా ఓ నివేదిక వెల్లడించింది. చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల ఏర్పడే తక్కువ ఎత్తుకు సంబంధించి తాము సాధించిన పురోగతిని కూడా ప్రపంచంలోని నాలుగో వంతు దేశాలు అంచనా వేయలేకపోవడం పరిస్థితికి అద్దం పడుతున్నది. మూడో వంతు దేశాలే ఈ లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది. పిల్లల పోషకాహార లోపం అంచనాలు (జేఎంఈ)-2023 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. యూనిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ బ్యాంకు సంయుక్తాధ్వర్యంలో ఈ అధ్యయనం నిర్వహించారు. ఐదేండ్లలోపు చిన్నారుల్లో పోషకాహార లోపం వల్ల ఏర్పడే దుష్పరిణామాలైన తక్కువ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, అధిక బరువుపై ఈ అధ్యయనం జరిగింది.
వరల్డ్ హెల్త్ అసెంబ్లీ (డబ్ల్యూహెచ్ఏ) గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్-2025, సుస్థిర అభివృద్ధి లక్ష్యం-2030లను చేరుకునేందుకు సరిపడా పురోగతి ప్రపంచవ్యాప్తంగా కనిపించడం లేదని ఈ నివేదిక వెల్లడించింది. 2030 నాటికి అధిక బరువును నివారించాలని పెట్టుకున్న లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా 6 దేశాలే కృషి చేస్తుండగా, వాటిలో ఒకటే పురోగతి దిశగా పయనిస్తున్నదని తెలిపింది. ఎత్తుకు తగ్గ బరువు లక్ష్యాన్ని ప్రపంచంలోని సగం దేశాలు చేరుకోలేవని నివేదికలో వెల్లడైంది. 2030 నాటికి 3.95 కోట్ల మంది చిన్నారులు తక్కువ ఎత్తును నివారించే లక్ష్యానికి దూరంగా నిలిచిపోతారని తెలిపింది.
వీరిలో 80 శాతం మంది ఆఫ్రికాకు చెందినవారే కావడం శోచనీయం. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా 14.81 కోట్ల మంది తక్కువ ఎత్తు, 4.5 కోట్ల మంది ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం, 3.7 కోట్ల మంది అధిక బరువుతో బాధపడుతున్నట్టు వెల్లడైంది. 2000-2022 మధ్యలో తక్కువ ఎత్తు, ఎత్తుకు తగ్గ బరువు విషయంలో పురోగతి కనిపించగా, అధిక బరువు కేసులు పెరిగాయి. భారత్లోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి.