బాలురపైనా లైంగిక దాడులు
డజన్ల కేసులు నమోదయ్యాయి
ఐక్యరాజసమితి అధికారుల వెల్లడి
కీవ్, మే 4: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా దారుణాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. మానవ మృగాల్లా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన రష్యా సైనికులు.. ఆఖరుకు పురుషులు, బాలురుపై కూడా లైంగిక దాడులకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ అధికారులతో పాటు ఐక్యరాజ్యసమితి అధికారులు కూడా చెబుతున్నారు. ఐరాస ప్రత్యేక ప్రతినిధి ప్రమీలా పాటేన్ మాట్లాడుతూ పురుషులు, బాలురుపై లైంగిక దాడులకు సంబంధించి ఇప్పటి వరకు డజన్ల సంఖ్యలో కేసులు నమోదయ్యాయని, బయటపడని కేసులు ఇంకా ఎన్నో ఉండవచ్చని ఆమె పేర్కొన్నారు. పరువు నష్టంతో పాటు ఇతర కారణాల వల్ల రేప్నకు గురైన మహిళలు, బాలికలు ఆ విషయాన్ని బయటపెట్టలేని పరిస్థితుల్లో ఉండగా.. ఇక, పురుషుల విషయానికి వస్తే ఇది మరింత కష్టంగా మారిందన్నారు.
మరో రెండు నగరాల స్వాధీనానికి యత్నాలు
ఉక్రెయిన్ పశ్చిమాన విదేశీ ఆయుధ సరఫరా మార్గాలను రష్యా బలగాలు లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నాయి. మరోవైపు తూర్పు ప్రాంతంలో కూడా దాడులను ఉద్ధృతం చేశాయి. ఉక్రెయిన్ వ్యాప్తంగా ఐదు రైల్వేస్టేషన్లలోని విద్యుత్తు సరఫరా వ్యవస్థలతో పాటు పలు ఆయిల్ డిపోలను ధ్వంసం చేసినట్టు రష్యా మిలటరీ బుధవారం పేర్కొన్నది. డాన్బాస్ రీజియన్లో 21 మంది పౌరులు మరణించారని ఉక్రెయిన్ అధికారులు ప్రకటించారు. తూర్పు ఉక్రెయిన్లోని క్రమాటోర్స్, సెవెరొడోనెట్స్ నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ప్రయత్నిస్తున్నాయని బ్రిటన్ మిలటరీ పేర్కొన్నది. మరియు పోల్లోని అజోవ్స్టల్ స్టీల్ ప్లాంట్లో చిక్కుకుపోయిన ఉక్రెయిన్ బలగాలతో కమ్యూనికేషన్ తెగిపోయిందని నగర మేయర్ తెలిపారు. మరోవైపు మరియుపోల్ థియేటర్పై రష్యా దాడిలో మరణాల సంఖ్య 600 వరకు ఉంటుందని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ తెలిపింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులను ఆరు నెలల్లో దశలవారీగా నిలిపేయాలని యూరోపియన్ యూనియన్ ఎగ్జిక్యూటివ్ కమిషన్ ప్రతిపాదించింది.