కీవ్: ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇవాళ ఉక్రెయిన్లో పర్యటించారు. రాజధాని కీవ్ పరిసర ప్రాంతాలను ఆయన విజిట్ చేశారు. కీవ్కు ఈశాన్య దిశలో ఉన్న బొరొడియాంకా పట్టణాన్ని ఆయన విజిట్ చేశారు. రష్యా జరిపిన వైమానిక దాడులు, బాంబింగ్ వల్ల ఆ ప్రాంతంలో భారీ నష్టం జరిగింది. అక్కడ ఉన్న హృదయ విదారకర పరిస్థితుల్ని చూసి గుటెర్రస్ చలించిపోయారు. ఆ ధ్వంసమైన బిల్డింగ్లను చూస్తుంటే, ఆ ఇండ్లల్లో నా ఫ్యామిలీ ధ్వంసమైనట్లు అనిపిస్తోందని, నా మనవరాళ్లు భయంతో పరుగులు తీస్తున్నట్లు ఆలోచనలు వస్తున్నాయని గుటెర్రస్ తెలిపారు. 21వ శతాబ్ధంలో యుద్ధం ఓ మూర్ఖత్వం అని, యుద్ధం ఓ దుష్ట చర్య, ఇలాంటి భయానక పరిస్థితుల్ని గమనిస్తుంటే గుండె పగిలిపోతోందని, బాధితులకు నివాళి అర్పిస్తున్నానని, కానీ ఏ పరిస్థితుల్లోనూ 21వ శతాబ్ధంలో యుద్ధాన్ని ఆమోదించబోమన్నారు. బుచాలో ఓ చర్చి వద్ద జరిగిన సామూహిక హత్యలు ప్రదేశాన్ని గుటెర్రస్ విజిట్ చేశారు. ఇలాంటి ఘటనలపై బాధ్యతాయుతమైన సమగ్ర విచారణ అవసరమని అన్నారు. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు విచారణకు రష్యా సహకరించాలని యూఎన్ చీఫ్ తెలిపారు.