కీవ్ : రష్యన్ సైనికుల దమనకాండపై ఉక్రెయిన్ పౌరులు, మహిళలు ఒక్కొక్కరుగా గళం విప్పుతున్నారు. తన భర్తను కాల్చిచంపిన కొద్ది సేపటికే తన నాలుగేండ్ల కుమారుడు ఏడుస్తున్నా లెక్కచేయకుండా ఇద్దరు రష్యన్ సైనికులు తనకు తుపాకీ గురిపెట్టి లైంగిక దాడికి పాల్పడ్డారని ఉక్రెయిన్ మహిళ వెల్లడించారు. ఆమె ఆరోపణలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.
మార్చి 9న రష్యన్ సైనికులు కాల్పులతో హోరెత్తిస్తూ తమ ఇంట్లోకి చొచ్చుకువచ్చారని తొలుత తమ పెంపుడు కుక్కను కాల్చిచంపిన వారు గేటు ముందు తన భర్తపై కాల్పులు జరిపారని భర్త కోసం తాను ఇంటి బయటకు రాగా ఆయన గేటు వద్ద విగతజీవిగా పడిఉన్నాడని ఆమె గుర్తుచేసుకున్నారు. భర్త గురించి అడగ్గా ఆయన నాజీ కావడంతో చంపేశామని సైనికులు బదులిచ్చారని తెలిపారు. ఆపై రష్యన్ సైనికులు తన నోరు నొక్కి తుపాకీ గురిపెట్టి తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పారు.
సైనికులు తనను దుస్తులు తొలగించాలని బెదిరించారని ఆపై ఒకరి తర్వాత మరొకరు ఇద్దరు సైనికులు దారుణానికి తెగబడ్డారని తెలిపారు. తన బిడ్డ ఏడుస్తుండగా లోపలికి వెళ్లి అతడిని ఊరుకోబెట్టి తిరిగి రావాలని వారు హుకుం జారీ చేశారని గుర్తు చేసుకున్నారు. భర్త మృతదేహాన్ని ఇంటి వద్దే విడిచిపెట్టిన ఆమె గ్రామాన్ని వదిలివచ్చింది. తమ గ్రామం ఇప్పటికీ రష్యన్ సైనికుల చెరలో ఉన్నందున తిరిగి గ్రామానికి వెళ్లబోనని, భర్త శవాన్ని పాతిపెట్టబోమని ఆమె చెప్పుకొచ్చారు.