Russia Ukraine War | ఐదున్నర నెలలుగా ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కొనసాగుతున్నది. ఇప్పటికే చాలా ప్రాంతాలను రష్యన్ సైన్యం ఆక్రమించింది. అయితే, ఆక్రమిత నగరాలు, పట్టణాల్లో ప్రజలకు మందుల సరఫరాను రష్యన్ అధికారులు పదేపదే అడ్డుకుంటున్నారని ఉక్రెయిన్ ఆరోగ్యమంత్రి విక్టర్ లియాష్కో ఆరోపించారు. మానవత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నేరాలను తాము యుద్ధ నేరాలుగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ఉక్రెనియన్ ప్రభుత్వం క్యాన్సర్, దీర్ఘకాలిక ఆరోగ్య పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు మందులు అందించే కార్యక్రమం కొనసాగిస్తున్నది. ఐక్యరాజ్య సమితి, ఉక్రేనియన్ అధికారుల ప్రకారం.. దేశంలో ఏడు మిలియన్ల మంది చెల్లాచెదురుకావడం, ఆసుపత్రులు, మౌలిక సదుపాయాలు ధ్వంసంకావడంతో చికిత్సలకు ఆటంకం కలుగుతున్నది.
ఈ ఏడాది ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ఉక్రెయిన్పై సైనిక చర్యలకు ఆదేశించిన సమయంలో.. ఆ దేశంలో కరోనా మహమ్మారి నేపథ్యంలో అందిస్తున్న ఆరోగ్య సేవలకు తీవ్ర అంతరాయం కలిగించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగస్టు 11 నాటికి ఆసుపత్రులు, ఇతర ఆరోగ్య సంరక్షణ సౌకార్యలపై 445 దాడులు జరిగాయని నమోదు చేసింది. దీని ఫలితంగా 86 మంది మరణించగా.. 105 మంది గాయపడ్డారు. ఆ తర్వాత పరిస్థితులు చాలా తీవ్రంగా ఉన్నాయని లియాష్కో పేర్కొన్నారు. ఉక్రెయిన్ దళాల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయని.. ఈ సమయంలో గుండెపోటు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తీసుకురావడం కష్టంగా ఉందన్నారు. కొన్నిసార్లు సమయానికి చేరుకోలేకమని, అంబులెన్స్ సమయానికి సమయానికి అక్కడికి చేరుకోలేకపోవచ్చన్నారు. పోరాటంలో మరణించిన వారి కంటే.. యుద్ధం చాలా ఎక్కువ ప్రాణనష్టాన్ని కలిగిస్తుందన్నారు.