ఏథెన్స్, జూలై 17: గ్రీస్ ఉత్తర ప్రాంతంలోని కవలా నగర సమీపంలో ఉక్రెయిన్ విమాన సంస్థ మెరిడియన్ నిర్వహించే ఓ ఆంటోనోవ్ కార్గో విమానం శనివారం రాత్రి కుప్పకూలింది. దీంతో ఆ ప్రాంతంలో 2 గంటల పాటు భారీస్థాయిలో పేలుళ్ల శబ్ధాలు వినిపించడంతో పాటు పెద్దయెత్తున మంటలు రేగాయి. సెర్బియా నుంచి జోర్డాన్ మీదుగా బంగ్లాదేశ్ వెళ్లాల్సిన ఈ విమానంలో ల్యాండ్మైన్లతో సహా దాదాపు 12 టన్నుల మేర ఆయుధ సామగ్రి తరలిస్తున్నారు. ఈ దుర్ఘటనలో పైలట్లతో సహా 8 మంది సిబ్బంది మరణించారు. వీరంతా ఉక్రెయిన్కి చెందిన వారని తెలుస్తున్నది. విమానంలోని ఓ ఇంజిన్లో తలెత్తిన సాంకేతిక సమస్యే ఈ ప్రమాదానికి కారణమని గ్రీస్ సివిల్ ఏవియేషన్ అథారిటీ పేర్కొన్నది. పైలట్ అందించిన సమాచారంతో కవలా ఎయిర్పోర్టులో అత్యవసర ల్యాండింగ్కు ఏర్పాట్లు చేశామని, అయితే ఆ వెంటనే విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిన తర్వాత ఎయిర్పోర్టుకు 40 కిలోమీటర్ల దూరంలోని పొలాల్లో ఫ్లైట్ కుప్పకూలిందని అధికారులు పేర్కొన్నారు.