కీవ్: ఉక్రెయిన్తో ఒకవైపు చర్చలు కొనసాగిస్తున్న రష్యా, మరోవైపు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు చేస్తున్నది. నల్ల సముద్రంలోని పోర్ట్ సిటీ ఒడెస్సాపై ఆదివారం ఉదయం వైమానిక దాడులు చేసింది. దీంతో భారీగా మంటలు, పొగలు ఎగసిపడినట్లు ఉక్రెయిన్ మంత్రి అంటోన్ హెరాష్చెంకో తెలిపారు. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీప నగరాల నుంచి రష్యా దళాలు వెనక్కి మళ్లాయి. దీంతో ఆ ప్రాంతాలను ఉక్రెయిన్ ఆర్మీ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకున్నది.
అయితే ఎక్కడ చూసినా శవాల గుట్టలే కనిపిస్తున్నాయి. రష్యా దాడుల్లో బాగా ధ్వంసమైన కీవ్కు సమీపంలోని బుచ్చా నగరంలో సుమారు 300 మందిని పూడ్చిపెట్టిన సామూహిక సమాధిని గుర్తించినట్లు మేయర్ అనటోలీ ఫెడోరుక్ తెలిపారు. వీరి తల వెనుక కాల్పులు జరిపి చంపారని ఆరోపించారు. అలాగే రోడ్లపైన, పలు చోట్ల సాధారణ దుస్తుల్లో ఉండి మరణించిన సుమారు 20 మృతదేహాలను కనుగొన్నట్లు తెలిపారు. షాకులో ఉన్న ఉన్న ప్రజలకు ఆహారం, మందులను ఉక్రెయిన్ సైనికులు అందజేస్తున్నారని చెప్పారు. కాగా, రష్యా ఆధీనంలోని దక్షిణాది సిటీ ఎనర్హోదార్లో శాంతియుతంగా నిరసన చేస్తున్న జనంపై రష్యా సైనికులు కాల్పులు జరిపారని, దీంతో పలువురు గాయపడ్డారని ఉక్రెయిన్ మానవ హక్కుల అంబుడ్స్మెన్ లియుడ్మిలా డెనిసోవా ఆరోపించారు.
మరోవైపు ఉక్రెయిన్లో చర్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు త్వరగా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలని ప్రముఖ యుద్ధ నేరాల ప్రాసిక్యూటర్ కార్లా డెల్ పోంటే అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును డిమాండ్ చేశారు. కాగా, కీలకమైన ఉక్రెయిన్ ప్రతిపాదనలకు రష్యా మౌఖికంగా అంగీకరించిందని రష్యాతో శాంతి చర్చలు జరుపుతున్న ఉక్రెయిన్ టాప్ మధ్యవర్తి తెలిపారు. దాడులను ముగించే దిశగా చర్చలు ముందుకు సాగుతున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.