కీవ్: యాంటీ ట్యాంక్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లతో ఉక్రెయిన్ రెచ్చిపోతోంది. ఆ మిస్సైళ్ల వల్ల రష్యా వరుసగా యుద్ధ ట్యాంకులను కోల్పోతోంది. ఉక్రెయిన్పై ఈజీగా విక్టరీ కొడుదామనుకున్న రష్యాకు యాంటీ మిస్సైళ్ల రూపంలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఆయుధాలు ఇవ్వండి అంటూ జెలెన్స్కీ ఇచ్చిన పిలుపుకు పశ్చిమ దేశాలు స్పందించాయి. ఇప్పటి వరకు ఆ దేశానికి 17 వేల యాంటీ ట్యాంక్ మిస్సైళ్లను, వేలాది యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లను అందించారు. అయితే అమెరికాకు చెందిన సెయింట్ జావెలన్తో పాటు బ్రిటన్కు చెందిన ఎన్ఎల్ఏడబ్ల్యూ మిస్సైళ్లు రష్యాను వణికిస్తున్నాయి. ఆ మిస్సైళ్లతో ఉక్రెయిన్ చేస్తున్న ప్రతిదాడితో రష్యా సైన్యం తీవ్ర నష్టాన్ని చవిచూస్తోంది. వాస్తవానికి యుద్ధం మొదలైన సమయంలో రష్యా వద్ద ఉక్రెయిన్ కన్నా 5 రెట్లు ట్యాంక్లు ఎక్కువగా ఉన్నాయి. ఇక యుద్ధ విమానాలు 9 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. కానీ యాంటీ ట్యాంక్, యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిస్సైళ్లతో ఉక్రెయిన్ విరుచుకుపడుతున్న తీరు రష్యాను ఖంగుతినిపిస్తోంది. సైనికులు తమ భుజాలపై మోసుకువెళ్లే రీతిలో ఉండే మిస్సైళ్లతో ఉక్రెయిన్ దళాలు ఊపేస్తున్నాయి. రష్యా బలగాలు నెమ్మదించడంలో యాంటీ ట్యాంక్ మిస్సైళ్ల పాత్ర ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
బ్రిటన్ ఇప్పటి వరకు 3615 షార్ట్ రేంజ్ నెక్ట్స్ జనరేషన్ లైట్ యాంటీ ట్యాంక్ వెపన్స్(ఎన్ఎల్ఏడబ్ల్యూ)ను పంపించింది. వీటితో పాటు లాంచర్లు కూడా ఉన్నాయి. వెయ్యి యాంటీ ట్యాంక్ వెపన్స్ పంపిస్తున్నట్లు జర్మనీ ప్రకటించింది. నార్వే రెండు వేలు, స్వీడన్ 5 వేల వెపన్స్ పంపిస్తున్నట్లు తెలిపాయి. ఇక జావెలిన్ మిస్సైల్ వ్యవస్థలను అమెరికా పంపించింది. ఇతర దేశాలు కూడా ఆధునిక టెక్నాలజీ ఆయుధాలను పంపాయి. జావెలిన్, ఎన్ఎల్ఏడబ్ల్యూ మిస్సైళ్లు ట్యాంకర్లను పైనుంచి దెబ్బతీస్తాయి. వీటినే ఫైర్ అండ్ ఫర్గెట్ మిస్సైళ్లు అంటారు. ఓరిక్స్ అనే సంస్థ ఉక్రెయిన్లో జరిగిన నష్టాలపై అంచనా వేసింది. దాని ప్రకారం ఉక్రెయిన్ మిలిటరీ 76 యుద్ధ ట్యాంక్లను ధ్వంసం చేసింది. దాంట్లో ఆరు అత్యాధునిక టీ-90 ట్యాంక్లు ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఇప్పటి వరకు రష్యా మొత్తం 214 ట్యాంక్లను కోల్పోయినట్లు తెలుస్తోంది. 1292 వాహనాలను కూడా ఆ దేశం చేజార్చుకున్నది. ఇక ఈ యుద్ధంలో ఉక్రెయిన్ ఇప్పటి వరకు 65 ట్యాంక్లను కోల్పోయింది. వాటిలో 22 ధ్వంసం అయ్యాయి.
వందల, వేల డాలర్లు ఖరీదైన యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు.. లక్షల డాలర్లు ఖరీదైన యుద్ధ ట్యాంకర్లను ధ్వంసం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత యుద్ధంలో ఉక్రెయిన్ చాలా సమర్ధవంతంగా తన వెపన్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. రష్యాకు చెందిన యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, హెలికాప్టర్లు, వాహనాలను ఉక్రెయిన్ ధ్వంసం చేస్తూనే ఉంది. యాంటీ ట్యాంక్ మిస్సైళ్లు తక్కువ ధర కావడం వల్ల కూడా ఇతర దేశాలు ఉక్రెయిన్కు వాటిని అందిస్తున్నట్లు తెలుస్తోంది. కెనడాకు చెందిన ఎం72, జర్మనీకి చెందిన స్ట్రెలా మిస్సైళ్లను కూడా ఉక్రెయిన్కు తరలిస్తున్నారు. ఐరన్ డోమ్ రాకెట్ ఇంటర్సెప్షన్ మిస్సైల్ కావాలని ఇజ్రాయిల్ను కోరగా.. ఆ దేశం వాటిని ఇచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.