ఉక్రెయిన్పై రష్యా సేనలు దాడి చేయడాన్ని పశ్చిమ దేశాలన్నీ తప్పుబడుతూ.. రష్యాపై పలువిధాల ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యా కూడా కొన్ని దేశాలపై ఆంక్షలు విధించింది కానీ.. అవి అంత ప్రభావం చూపలేదు. అయితే యూరోపియన్ దేశాలకు అత్యధికంగా గ్యాస్, చమురు లభించేంది రష్యా నుంచే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న రష్యా ప్రభుత్వం.. పశ్చిమ దేశాల ఆంక్షల నుంచి తమ దేశ ఆర్ధిక వ్యవస్థను కాపాడుకునేందుకు ఒక ప్లాన్ వేసింది.
ఇకపై తన నుంచి చమురు. గ్యాస్ కొనుగోలు చేయాలనుకునే దేశాలు.. ముఖ్యంగా అవి తమ మిత్రదేశాలు కాకపోతే రష్యా కరెన్సీ (రూబెల్స్)లోనే చెల్లింపులు చేయాలని తేల్చిచెప్పింది. ఇలా రూబెల్స్లో చెల్లింపులు చేయడంలో విఫలమైన పోలాండ్, బల్గేరియాకు గ్యాస్ సరఫరా నిలిపివేస్తున్నట్లు రష్యా తాజాగా ప్రకటించింది. దీనిపై యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డర్ లెయెన్ స్పందించారు. రష్యా చేస్తోంది బ్లాక్మెయిలింగ్ అని ఆమె దుయ్యబట్టారు. ఇలా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం అంటే.. యూరోప్ను బ్లాక్మెయిల్ చేయడానికి గ్యాస్ను ఉపయోగించుకున్నట్లే అని ఆమె అన్నారు.