హైదరాబాద్ : రష్యాతో జరుగుతున్న పోరాటంలో తాము ఒంటరిగా మిగిలిపోయామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాల సాయం అందుతుందని భావించామని కానీ అలాంటిదేమీ జరగలేదని వాపోయారు. స్వాతంత్ర్య పోరాటంలో తాము ఒంటరిగా మిగిలామన్నారు. ఉక్రెయిన్తో ఉన్నారా? లేరా? అని మిత్రపక్ష దేశాలను అడుగుతున్నానని తెలిపారు. ఒక వేళ తమకు మద్దతుగా ఉంటే నాటో కూటమిలోకి మమ్మల్ని తీసుకోవడానికి ఎందుకు సిద్ధంగా లేరు అని ప్రశ్నించారు. మా దేశ భద్రత హామీల గురించి మాట్లాడేందుకు తాము భయపడం.. కానీ తమ దేశ రక్షణ మాటేమిటి అని అడిగారు. ఆ హామీని ఏ దేశాలు తమకు అందిస్తాయి అనేదే చూస్తున్నామని జెలెన్స్కీ పేర్కొన్నారు.
సైనిక లక్ష్యాలపై మాత్రమే దాడులు చేస్తున్నామని రష్యా చెబుతున్న, పౌరులపై కూడా దాడులు జరుగుతున్నాయని జెలెన్స్కీ తెలిపారు. తాను రాజధాని విడిచి పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఉక్రెయిన్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా తాను ప్రజలతోనే ఉంటానని జెలెన్స్కీ తేల్చిచెప్పారు.