ఉక్రెయిన్లో గంట గంటకూ పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం కూడా అప్రమత్తమవుతోంది. ఎప్పటికప్పుడు అక్కడ నివసిస్తున్న భారతీయులను అలర్ట్ చేస్తూనే వుంది. ఇప్పటికే రెండు మార్లు తగు సలహాలిచ్చింది. తాజాగా మూడో సలహా కూడా ఇచ్చింది. ఎయిర్ సైరన్లు, బాంబు వార్నింగ్లు ఇచ్చే ప్రాంతంలో గనక ఉంటే… వెంటనే బాంబు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని ఉక్రెయిన్లోని భారతీయులకు భారత ఎంబసీ సూచించింది.
గూగుల్ మ్యాప్ సహాయంతో దగ్గర్లో ఉన్న బాంబు షెల్టర్లలోకి వెళ్లిపోవాలని సూచించింది. భారతీయులు సురక్షితంగా ఉండడానికి తాము తగు ప్రయత్నాలు చేస్తూనే వున్నామని, భారతీయులందరూ ధైర్యంతో విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాలని ఉక్రెయిన్లో భారత రాయబారి పార్థా సత్పతి కోరారు. ఉక్రెయిన్లో ప్రస్తుతం మార్షియల్ లా అమలులో వుందని, అందుకే భారతీయుల తరలింపులో ఇబ్బందులున్నాయని భారత ఎంబసీ ఓ ప్రకటనలో పేర్కొంది.
భారతీయుల కోసం ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయం నిరంతరం అందుబాటులోనే వుంటుందని, భారత రాయబార కార్యాలయం ఇచ్చిన మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు పాటిస్తే సరిపోతుందని భారత ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్ తన గగన తలాన్ని మూసేయడంతో ప్రత్యేక విమానాలు రద్దయ్యాయని, ప్రత్యామ్నాయ మార్గాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని అక్కడి ఎంబసీ స్పష్టం చేసింది. వాటిపైనే చర్చలు జరుగుతున్నాయని, అవి ఓ కొలిక్కి రాగానే ప్రకటిస్తామని అధికారులు పేర్కొన్నారు.
భారతీయులందరూ పశ్చిమ ఉక్రెయిన్ వైపు వెళ్లిపోవాలని సూచించారు. ఈ సమయంలో పాస్పోర్టులతో పాటు అత్యవసరమైన డాక్యుమెంట్లను కూడా తమ దగ్గర ఉంచుకోవాలని ఉక్రెయిన్లోని భారత రాయబార కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. ‘ఉక్రెయిన్లోని పరిస్థితులు ఏమాత్రం బాగోలేవు. దయచేసి సహనంతో ఉండండి. ఎక్కడి వారు అక్కడే ఉండిపోండి. మీ మీ ఇళ్లల్లోనే తలదాల్చుకోండి.’ అంటూ భారత విదేశాంగ శాఖ అక్కడి వారికి సూచించింది.