కీవ్: ఉక్రెయిన్పై రష్యా దాడి నేపథ్యంలో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్లో సమస్యలు తలెత్తాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీని వల్ల న్యూక్లియర్ ప్లాంట్లో కూలింగ్ వ్యవస్థలకు ప్రమాదం పొంచి ఉందని ఉక్రెయిన్ ఆందోళన వ్యక్తం చేసింది. పవర్ కట్ వల్ల అత్యవసర జనరేటర్లు ప్లాంట్కు బ్యాకప్ విద్యుత్ను సరఫరా చేస్తున్నాయని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తెలిపారు. ఈ డీజిల్ జనరేటర్లు కేవలం 48 గంటలపాటు మాత్రమే పని చేస్తాయని చెప్పారు. డీజిల్ లేక జనరేటర్లు పని చేయకపోతే కూలింగ్ వ్యవస్థలపై ప్రభావం పడుతుందన్నారు. దీని వల్ల రేడియేషన్ లీక్ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దీంతో 48 గంటల్లో విద్యుత్ను పునరుద్ధరించాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలో చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్లో రిపేర్ కోసం రష్యా దళాలు కాల్పులు విరమించాలని ఆయన పిలుపునిచ్చారు.
కాగా, ఉక్రెయిన్పై యుద్ధానికి దిగిన రష్యా, తొలుత చెర్నోబిల్ అణు విద్యుత్ ప్లాంట్ను స్వాధీనం చేసుకున్నది. ఉక్రెయిన్ ఆర్మీ తిరిగి దీనిపై పట్టుసాధించింది. అయితే రష్యా సైన్యం ఈ అణు విద్యుత్ ప్లాంట్ను మరోసారి తన నియంత్రణలోకి తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ పునరుద్ధరణకు రిపేర్ కోసం కాల్పుల విరమణకు ఉక్రెయిన్ పిలుపునిచ్చింది. అయితే పవర్ కట్కు దారి తీసిన కారణాలు ఏమిటన్నది వెల్లడించలేదు.