లండన్: బ్రిటన్లో పెరుగుతున్న వలసలను అడ్డుకునేందుకు రిషి సునాక్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్నది. ఇకపై అత్యధిక వేతనాలున్న విదేశీ వృత్తి నిపుణులకు మాత్రమే ఉపాధి వీసాలు జారీచేయాలని, డిపెండెంట్లుగా వచ్చే భాగస్వాములకు కఠిన నిబంధనలను అమలు చేయాలని నిశ్చయించింది.
అందులో భాగంగా వర్క్ వీసా దరఖాస్తుదారుకు గతంలో 26 వేల పౌండ్లుగా నిర్దేశించిన కనీస వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచింది. ఇందుకు సంబంధించిన బిల్లును హోం శాఖ మంత్రి క్లెవర్లీ సోమవారం పార్లమెంట్ దిగువ సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందితే దాదాపు 3 లక్షల మంది విదేశీయులపై, ఎక్కువగా భారతీయులపై ప్రభావం పడుతుంది. ఆరోగ్య, సామాజిక సంరక్షణ వీసాలతో బ్రిటన్కు వెళ్లేవారిని అధిక వేతన పరిమితి నుంచి మినహాయించనున్నారు.