లండన్: బ్రిటిష్ రాజ కుటుంబంలో జాత్యహంకార ధోరణి వెలుగుచూసిన నేపథ్యంలో దానిపై ఆ దేశ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. జాత్యహంకార ధోరణి ఎప్పుడు, ఎక్కడ ఎదురైనా తప్పనిసరిగా ఎదురించాలన్నారు. బాల్యంలో తాను కూడా జాత్యహంకారాన్ని ఎదుర్కొన్నానని, అయితే ఇప్పుడు దేశం పురోగమించిందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు. అయితే బ్రిటన్ రాజ కుటుంబం గురించి కానీ, ఇటీవల అక్కడ వెలుగుచూసిన సంఘటన గురించి కానీ సునాక్ నేరుగా ప్రస్తావించకపోవడం గమనార్హం.
జాత్యహంకారాన్ని ఎదుర్కోవడంలో దేశం అద్భుతమైన ప్రగతి సాధించిందని, అయితే దాన్ని నిర్మూలించే పని ఇంకా పూర్తి కాలేదని రిషి సునాక్ చెప్పారు. అందుకే అది ఎప్పుడు కనిపించినా ఎదిరించాలన్నారు. ప్రిన్స్ విలియం గాడ్ మదర్ లేడీ సుసాన్ హసీ జాత్యహంకార ధోరణి ప్రదర్శించారనే ఆరోపణలు కలకలం రేపాయి. ఆమె ఓ ఆఫ్రికన్తో వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలోనే రిషి తన అభిప్రాయాలను వ్యక్తంచేశారు.
ఆఫ్రికా, కరీబియన్ మూలాలుగల బ్రిటిష్ జాతీయురాలు ఎన్గోజీ ఫులని (Ngozi Fulani) ట్విటర్లో వెల్లడించిన విషయాలు ఈ వివాదానికి కారణమయ్యాయి. రాయల్ ఎయిడ్ సుసాన్ హసీ తనను పదేపదే ‘‘ఆఫ్రికాలో ఏ ప్రాంతం నుంచి వచ్చారు మీరు?’’ అని ప్రశ్నించడం హింసించినట్లుగా అనిపించిందని చెప్పారు. కింగ్ ఛార్లెస్ సతీమణి కెమిల్లా ఆతిథ్యమిచ్చిన ఓ కార్యక్రమానికి తాను హాజరయ్యానని, అప్పుడు హసీ పదేపదే ఆ ప్రశ్న అడగడం బాధించిందన్నారు. చివరకు ‘‘నేను ఇక్కడే పుట్టాను, బ్రిటిషర్ను’’ అని చెప్పానని తెలిపారు.
ఈ నేపథ్యంలో రాయల్ ఎయిడ్ హసీ తన పదవికి రాజీనామా చేశారు. తాను ప్రవర్తించిన తీరుకు క్షమాపణ కోరారు. బకింగ్హామ్ ప్యాలెస్ విడుదల చేసిన ప్రకటనలో కూడా సుసాన్ హసీ వ్యాఖ్యలు ఆమోదయోగ్యం కాదని, తీవ్రంగా విచారించదగినవని పేర్కొన్నారు.