లండన్ : బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తాయి. లండన్ నుంచి లీడ్స్కు అరగంట ప్రయాణానికి 14 సీట్లుండే ఆర్ఏఎఫ్ జెట్ను వాడటం పట్ల ఇంత ఆర్భాటం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తాయి. లీడ్స్లో ఓ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించేందుకు ఏకంగా ప్రైవేట్ జెట్లో ప్రయాణించి పన్ను చెల్లింపుదారుల డబ్బును వృధా చేస్తున్నారని కన్జర్వేటివ్ పార్టీ నేతపై ఆరోపణలు వినిపిస్తున్నాయని ది మిర్రర్ పేర్కొంది.
ఎన్హెచ్ఎస్ రోగులు, సిబ్బందిని కలిసేందుకు రూత్ల్యాండ్ హెల్త్కేర్ సెంటర్ను సందర్శించేందుకు రిషీ సునాక్ సోమవారం ఆర్ఏఎఫ్ విమానంలో బయలుదేరారు. ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తూ రిషీ సునాక్ ప్రజాధనంతో షో చేస్తున్నారని లేబర్ పార్టీ ఆరోపణలు గుప్పించింది. ఎన్హెచ్ఎస్లో వింటర్ క్రైసిస్తో రోగులు, సిబ్బంది ప్రభుత్వం నుంచి సాయం కోసం వేచిచూస్తుంటే రిషీ సునాక్ మాత్రం ఫోటోలకు ఫోజులిచ్చే పనిలో బిజీగా ఉన్నారని లేబర్ పార్టీ డిప్యూటీ నేత ఏంజిలా రేనర్ మండిపడ్డారు.
36 నిమిషాల ప్రయాణానికి ప్రైవేట్ జెట్లో విహారానికి పన్ను చెల్లింపుదారుల డబ్బు ఎంత వృధా చేశారో రిషీ సునాక్ వెల్లడించాలని డిమాండ్ చేశారు. కాగా సమయాభావంతోనే రైలు ప్రయాణానికి బదులు ప్రధాని రిషీ సునాక్ విమానంలో వెళ్లాల్సి వచ్చిందని టెన్ డౌనింగ్ స్ట్రీట్ తెలిపింది.