Rishi Sunak | బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు వింత అనుభవం ఎదురైంది. రోగులను పరామర్శించేందుకు ఆసుపత్రికి వెళ్లిన రిషి సునాక్.. అక్కడ ఓ రోగి మాటలకు ఆశ్చర్యానికి గురయ్యారు.
రిషి సునాక్ శుక్రవారం సౌత్ లండన్లోని క్రొయిడన్ యూనివర్సిటీ ఆసుపత్రిని సందర్శించి రోగులను పరామర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఓ మహిళా రోగిని పరామర్శిస్తూ.. ఆసుపత్రి సిబ్బంది ఎలా చూసుకుంటున్నారు..? అని ప్రశ్నించారు. దానికి ఆమె ‘బాగానే చూసుకుంటున్నారు.. అయితే, ఆసుపత్రి సిబ్బందికి ప్రభుత్వం చాలా తక్కువ వేతనాలు ఇస్తోంది. వాటిని చూస్తుంటే జాలేస్తోంది’ అని బదులిస్తుంది. నర్సుల వేతనాలు పెంచాలని కోరుతుంది. దీనికి రిషి.. ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అంటూ బదులిస్తారు. అంతలోనే ఆమె కల్పించుకొని ‘ప్రయత్నించడం కాదు.. తీవ్రంగా ప్రయత్నించాలి’ అని అంటుంది. రోగి మాటలకు ఆశ్చర్యపోయిన రిషి సునాక్.. ఓకే తప్పకుండా అని బదులిస్తారు.
యూకేలో దాదాపు 3 లక్షల మంది నర్సింగ్ సిబ్బంది వేతనాల పెంపు కోరుతూ సమ్మె చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఓటింగ్ కూడా నిర్వహించారు. సమ్మెకు వెళ్లేందుకు ఓటింగ్ నిర్వహించడం ఈ శతాబ్ద కాలంలో బ్రిటన్లో ఇదే తొలిసారి. పెరిగిపోతున్న ధరలకు తోడు, ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వేతనాల్లో పెరుగుదల లేదని, అందుకే ఓటింగ్ నిర్వహించాల్సి వచ్చిందని రాయల్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తెలిపింది. జాతీయ వైద్య సేవల కింద బ్రిటన్లో 1948 నుంచి ఉచిత వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ సేవలకు కేటాయించిన బడ్జెట్లో మూడింట ఒక వంతును ఆరోగ్య సేవల కోసమే ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.