Diabetes | లండన్, అక్టోబర్ 3: బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లతో టైప్-1 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉన్నదని యూకేలోని కార్డిఫ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. బ్యాక్టీరియాలోని కొన్ని ప్రొటీన్లు మన రోగ నిరోధక వ్యవస్థను దెబ్బతీస్తాయని.. కిల్లర్ టీ సెల్స్ తీవ్రంగా ప్రభావితం అవుతాయని వివరించారు. బ్యాక్టీరియా కణాలను చంపే క్రమంలో కిల్లర్ టీ సెల్స్ కొన్ని సందర్భాల్లో ఇన్సులిన్ ప్రొటీన్ ఉత్పత్తి చేసే కణాలను కూడా చంపుతాయని వెల్లడించారు.
బెంగళూరులో 12 కేక్ శాంపిళ్లలో క్యాన్సర్ కారకాలను గుర్తించినట్టు కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం ప్రకటించింది. మొత్తం 235 శాంపిళ్లను సేకరించగా అందులో 12 కేక్లలో కృత్రిమ రంగులు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని తెలిపింది. ప్రజాదరణ పొందిన రెడ్ వెల్వెట్, బ్లాక్ ఫారెస్ట్ లాంటి కేక్లలో తరచూ ఈ కృత్రిమ రంగులను కలుపుతున్నారని.. వీటి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ప్రజలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అల్లూరా రెడ్, సన్ఫెస్ట్ యెల్లో ఏసీఎఫ్, పొన్సియూ 4ఆర్, టార్టాజైన్, కెర్మోసైన్ తదితర కృత్రిమ రంగుల వాడకంలో భద్రత ప్రమాణాలను పాటించాలని బేకరీలను ప్రభుత్వం ఆదేశించింది. కృత్రిమ రంగుల వాడకం క్యాన్సర్ కారకంగా పని చేయడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నదని కర్ణాటక ఆహార భద్రత, నాణ్యత విభాగం తెలిపింది.
మద్యం సేవించటం వల్ల ఆరు రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, అన్నవాహిక క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, పేగు క్యాన్సర్, ఉదర క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అమెరికన్ అసోసియేషన్ ఫర్ క్యాన్సర్ రిసెర్చ్ పరిశోధకులు వెల్లడించారు. మద్యపానం వల్ల మన డీఎన్ఏ కూడా దెబ్బతినే చాన్స్ ఉన్నదని తెలిపారు. 2019 డాటా ప్రకారం ప్రతి 20 మందిలో ఒకరు మద్యం సేవించటం వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారేనని వివరించారు. క్యాన్సర్ పెరగటానికి అనేక కారణాలు దోహదం చేస్తాయని స్పష్టంచేశారు.