టునిస్: టునీషియాలో రాజకీయ సంక్షోభం నెలకొన్నది. ఆ దేశ ప్రధాని హిచెమ్ మిచిచిపై దేశాధ్యక్షుడు కాయిస్ సయిద్ వేటు వేశారు. ప్రధానిని తొలగిస్తూ అధ్యక్షుడు ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సామూహిక నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్న నేపథ్యంలో అధ్యక్షుడు ఆ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కేసుల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైనట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. 2019లో దేశాధ్యక్షుడిగా ఎన్నికైన కాయిస్ సయిద్.. ప్రభుత్వాన్ని టేకోవర్ తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఆయన మద్దతుదారులు సంబరాల్లో మునిగితేలారు.
పార్లమెంట్లో ప్రధాని మిచిచికి అతిపెద్ద పార్టీ ఎన్నాహద్ నుంచి గట్టి సపోర్ట్ ఉన్నా.. అధ్యక్షుడు ఆయన్ను తొలగించడం గమనార్హం. కరోనా వైరస్ సంక్షోభం నేపథ్యంలో ఇటీవలే ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రిపై వేటు వేశారు. అయితే ఆదివారం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో ప్రధాని మిచిచితో పాటు ఎన్నాహద్ పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరిగాయి. దేశరాజధాని టునిస్లో పార్లమెంట్ వీధిలో రోడ్డును బ్లాక్ చేశారు. ఎన్నాహద్ పార్టీ ఆఫీసులోకి వెళ్లిన నిరసనకారులు కంప్యూటర్లు ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. తౌజేర్ గఫ్సాతో పాటు ఇతర నగరాల్లో నిరసనలు భగ్గుమన్నాయి.