న్యూయార్క్: క్యాపిటల్ హిల్పై దాడి కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పాత్ర ఉన్నట్లు ఆ ఘటనపై విచారణ చేపట్టి కాంగ్రెస్ ప్యానల్ కమిటీ వెల్లడించింది. 2021 జనవరి ఆరో తేదీన క్యాపిటల్ హిల్పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడికి ట్రంప్ కుట్ర పన్నినట్లు కమిటీ తన రిపోర్ట్లో పేర్కొన్నది. 845 పేజీల రిపోర్ట్ను ప్యానెల్ రిలీజ్ చేసింది. క్యాపిటల్ హిల్ దాడికి ట్రంప్ కారణమంటూ ఆ రిపోర్ట్లో పేర్కొన్నది. భవిష్యత్తులో ట్రంప్ మళ్లీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించాలని ఆ కమిటీ ప్రతిపాదన చేసింది. విచారణ సమయంలో ట్రంప్ సహకరించలేదని ప్యానెల్ పేర్కొన్నది.
18 నెలల పాటు అమెరికా కాంగ్రెస్ ఈ దాడి కేసులో విచారణ కొనసాగించింది. దీంట్లో 10 సార్లు పబ్లిక్ విచారణ చేపట్టారు. సుమారు వెయ్యి మందికిపైగా సాక్షుల్ని విచారించారు. ట్రంప్ పాలన సమయంలో ఉన్న అధికారుల్ని కూడా విచారించారు. క్యాపిటల్ హిల్పై దాడికి ప్రజల్ని అమెరికా అధ్యక్షుడే రెచ్చగొట్టడం ఊహించలేనిదిగా ఉందని కమిటీ చైర్మెన్ బెన్నీ థాంప్సన్ తన రిపోర్ట్లో పేర్కొన్నారు.
విచారణలో భాగంగా కాంగ్రెస్ కమిటీ మొత్తం 11 ప్రతిపాదనలు చేసింది. మరోసారి ప్రభుత్వ హోదాలో కొనసాగేందుకు ట్రంప్కు అవకాశం ఇవ్వరాదు అని కమిటీ తీర్మానించింది. దేశాధ్యక్ష ఎన్నికల్లో ఓటమి తట్టుకోలేని ట్రంప్.. తప్పుడు ప్రచారం చేసినట్లు కమిటీ తెలిపింది. ట్రంప్ వాదనల వల్ల అల్లరిమూకలు వాషింగ్టన్లో బీభత్సం సృష్టించినట్లు కమిటీ చెప్పింది. అల్లర్ల సమయంలో నిర్ణయం తీసుకోవడంలో ట్రంప్ విఫలమైనట్లు పేర్కొన్నది. అతివాద గ్రూపులు ఆ దాడిని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ఉపాధ్యక్షుడిపై ట్రంప్ వత్తిడి తెచ్చినట్లు ఆరోపించారు.