ఓహియో: అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ సేనేటర్ ఎన్నికల్లో జేడీ వాన్స్ గెలిచారు. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుతో జేడీ వాన్స్ ఈజీగా విక్టరీ కొట్టారు. ఇక నవంబర్లో జరిగే సేనేట్ ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థి టిమ్ ర్యాన్తో ఆయన పోటీ పడనున్నారు. అయితే రిపబ్లికన్ అభ్యర్థి జేడీ వాన్స్ భార్య భారతీయ సంతతి వ్యక్తి కావడం విశేషం. భారతీయ మూలాలు ఉన్న ఆమె పేరు ఉషా చిలుకూరి వాన్స్. శాన్ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీల్లో ఆమె ఓ న్యాయ సంస్థలో లిటిగేటర్గా పనిచేస్తున్నారు. సివిల్ కేసులు వాదించడంలో ఆమె దిట్ట. ఉన్నత విద్య, స్థానిక ప్రభుత్వం, ఎంటర్టైన్మెంట్, టెక్నాలజీ రంగాల్లోనూ ఉషా చిలుకూరి కేసుల్ని వాదిస్తుంటారు.
యేల్లో న్యాయ విద్య అభ్యసిస్తున్న సమయంలో జేడీ వాన్స్, ఉషా చిలుకూరి మధ్య పరిచయం ఏర్పడింది. 2014లో వారిద్దరి మధ్య వివాహం జరిగింది. జేడీ వాన్స్ పుస్తక రచయిత కూడా. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఉషా తన భర్తతో కలిసి ఓహియోలోని సిన్సినాటిలో ఉంటున్నారు. తన హోమ్ టౌన్ కాలిఫోర్నియాలోని శాన్ డియాగో అని ఉషా తన ఫేస్బుక్ పేజీలో రాశారు. అక్కడ మౌంట్ కార్నెల్ స్కూల్లో చదివినట్లు తెలుస్తోంది. యేల్ లా కాలేజీలో చదువుతున్న సమయంలో ఉషా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నది. 2007లో ఆమె యేల్ వర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జ్ వర్సిటీ నుంచి 2019లో ఎంఫిల్ పొందారు. యేల్ లా జర్నల్కు ఎడిటర్గా చేశారామె. చీఫ్ జస్టిస్ జాన్ జీ రాబర్ట్స్కు క్లర్క్గా ఉషా పనిచేశారు. జడ్జి బ్రెట్ కవనాగ్ వద్ద కూడా ఆమె చేశారు.