టొరంటో, సెప్టెంబర్ 21: కెనడా పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని జస్టిన్ ట్రూడో సారథ్యంలోని లిబరల్ పార్టీ తిరిగి విజయం సాధించింది. 49 ఏండ్ల ట్రూడో వరుసగా మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో సఫలమైనా ఆయన పార్టీ సొంతంగా పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది. కరోనా నియంత్రణలో సమర్థంగా చర్యలు తీసుకున్నందుకు ప్రజలు పూర్తిస్థాయి మెజారిటీ కట్టబెడతారన్న నమ్మకంతో ట్రూడో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఆయన మైనారిటీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేకపోయినా ‘మధ్యంతర’ నిర్ణయం తీసుకోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంచుమించు రెండేండ్ల కిందట ఫలితాలే పునరావృతమయ్యాయి. లిబరల్ పార్టీ 156 స్థానాలు సాధించింది. ఇది 2019లో గెలిచిన స్థానాల కంటే ఒకటి తక్కువ. హౌస్ ఆఫ్ కామన్స్లో మెజారిటీకి 170 స్థానాలు అవసరం. మ్యాజిక్ ఫిగర్కు 14 స్థానాల దూరంలో లిబరల్ పార్టీ నిలిచిపోయింది.
17 మంది ఇండో-కెనడియన్ల గెలుపు
కెనడా ఎన్నికల్లో 17 మంది భారత సంతతి అభ్యర్థులు విజయం సాధించారు. ట్రూడో క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన హర్జిత్ సజ్జన్, అనితా ఆనంద్, బర్దీష్ చగ్గర్తో పాటు న్యూ డెమోక్రాటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్ విజయం సాధించారు. లిబరల్ పార్టీ నుంచి మరో 11 మంది, కన్జర్వేటివ్ పార్టీ నుంచి ఇద్దరు గెలుపొందారు. కెనడాలో భారత సంతతి ప్రజలు 16 లక్షల మంది నివసిస్తున్నారు. ఇది కెనడా జనాభాలో 3%.