రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం నడుస్తోంది. పలు కీలక నగరాలను కూడా స్వాధీనం చేసుకున్నాయి. అంతేకాకుండా యూరప్లోనే అతిపెద్ద అణువిద్యుత్తు కేంద్రమైన జపోరిజియాపై రష్యా సేనలు దాడులకు దిగాయి. సరిగ్గా ఈ వార్తల నేపథ్యంలో మరో కొత్త రిపోర్టు బయటకొచ్చింది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని చంపడానికి ఇప్పటికి మూడు సార్లు ప్రయత్నాలు జరిగాయన్నది ఆ రిపోర్టు సారాంశం. టైమ్స్ ఆఫ్ లండన్ పత్రిక కథనం ప్రకారం..
రష్యా సైనికులు ఎప్పుడైతే ఉక్రెయిన్పై దాడులకు తెగబడ్డారో.. అదే రోజు నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని హతమార్చాలని ప్రయత్నాలు ప్రారంభించారని ఆ పత్రిక పేర్కొంది. అలా.. ఇప్పటికి మూడు సార్లు ఈ హత్యా ప్రయత్నం జరిగిందని వెల్లించింది. ఇందుకోసం రెండు దళాలను కూడా నియమించారు. ఈ రెండు దళాలు తమ తమ పనుల్లో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. అయితే మూడు సార్లూ ఈ బృందాలు విఫలమైనట్లు తెలుస్తోంది.
దీని వెనుక క్రెమ్లిన్ మద్దతున్న వేగనర్ గ్రూపు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఓ 400 మంది వేగనర్ గ్రూపుకు చెందిన సభ్యులు ఇప్పటికీ ఉక్రెయిన్ రాజధాని కీవ్లోనే మాటు వేసినట్లు తెలుస్తోంది. వీరు ఇప్పటికే ఉక్రెయిన్కు చెందిన 24 మంది అధికారుల జాబితాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం.