Toxic gas leak : నార్త్ సెంట్రల్ నైజీరియా (N igeria) లోని ఓ గని (Mine) లో విషవాయువులు (Toxic gases) లీకయ్యాయి. ఈ విషవాయువులు పీల్చి 37 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 26 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుందని అక్కడి పోలీస్ అధికారులు వెల్లడించారు.
గనిలో ఆకస్మికంగా లెడ్ ఆక్సైడ్, సల్ఫర్, కార్బన్ మోనాక్సైడ్ గ్యాస్లు లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని అధికారుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ గ్యాస్లు మానవాలికి చాలా విషపూరితమైనవని, ముఖ్యంగా తక్కువ వెంటిలేషన్ ఉన్న ఏరియాల్లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంటుందని అధికారులు తెలిపారు.
నైజీరియా సర్కారు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది. మృతదేహాలను అంతిమ సంస్కారాల కోసం కుటుంబసభ్యులకు అప్పగించింది. గనిలో విష వాయువులు లీకవుతాయనే విషయంలో ముందుగానే అవగాహన లేకపోవడంతో ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని అక్కడి మంత్రి చెప్పారు.
ప్రమాదానికి కారణమైన గని సక్రమమైనదా, అక్రమమైనదా అనే కోణంలో కూడా దర్యాప్తులో తేలుతుందని నైజీరియా మంత్రి తెలిపారు. నైజీరియాలో బంగారం కోసం పలు ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ జరుగుతోంది. ఈ గనుల్లో ఎంతో మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.