Titanic | బోస్టన్, జూన్ 20: అట్లాంటిక్ సముద్రంలో టైటానిక్ శకలాల్ని చూడటానికి కొంతమంది చేపట్టిన సాహసయాత్ర ఊహించని ప్రమాదంలో చిక్కుకుంది. టూరిస్ట్ సంస్థ ఓషియన్గేట్ పంపిన ‘టైటానిక్ సబ్ మెర్సిబుల్’ (మినీ జలాంతర్గామి) ఆదివారం రాత్రి గల్లంతైంది. ఈ ప్రమాదంతో అమెరికా, కెనడా రక్షణ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఆచూకీ కనుగొనేందుకు ఇరు దేశాల కోస్ట్గార్డ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దాదాపు 13 వేల అడుగుల లోతున్న చోట ఆ మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవిడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను కూడా రంగంలో దించారు.
సబ్ మెర్సిబుల్ గల్లంతై మూడు రోజులు దాటినా ఇప్పటికీ ఆచూకీ తెలియరాలేదని సమాచారం. ట్రక్ సైజులో ఉండే ‘టైటానిక్ సబ్మెర్సిబుల్’లో పాకిస్థాన్కు చెందిన ప్రముఖ వ్యాపారి షెహజాదా దావూద్, అతడి కుమారుడు సులేమాన్, బ్రిటిష్ సంపన్నుడు 58ఏండ్ల హమీశ్ హార్డింగ్, ఓషియన్ గేట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ స్టాక్టన్ రష్, పరిశోధకుడు పాల్ హెన్రీ నార్జిలెట్..మొత్తం ఐదుగురు ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. ఈ సాహసయాత్రలో పాల్గొనేందుకు ఒక్కో వ్యక్తి నుంచి దాదాపు రూ.రెండు కోట్లు వసూలు చేశారు. సెయింట్ జాన్స్ న్యూఫౌండ్లాండ్స్కు 700 కి.మీ దూరంలో ఈ ఘటన జరిగినట్టు ఓషియన్గేట్ సంస్థ తెలిపింది.