వాషింగ్టన్: సముద్రం అడుగున్న ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను (Titanic Ship Wreck) పర్యాటకులకు చూపించే సబ్మెర్సిబుల్ బోటు మిస్సింగ్ అయ్యింది. దీంతో దాని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అందులో ఎవరైనా పర్యాటకులు ఉన్నారా లేదా అన్నది తెలియలేదు. భారీ ఎత్తున నిర్మించిన ఆధునిక ఓడ టైటానిక్ తొలి ప్రయాణంలోనే సముద్రంలో మునిగిపోయింది. 1912 ఏప్రిల్ 15న జరిగిన దుర్ఘటనలో 1,500 మందికిపైగా మరణించారు. అయితే టైటానిక్ మునిగిపోయిన ప్రదేశం కెనడాలోని న్యూఫౌండ్లాండ్ తీరానికి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. అట్లాంటిక్ సముద్రం దిగువన 3,800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ షిప్ శిథిలాలను 1985లో తొలిసారి కనుగొన్నారు. నాటి నుంచి సముద్రంలో మునిగిన ఆ భారీ ఓడ కోసం మరింతగా అన్వేషిస్తున్నారు.
కాగా, టైటానిక్ షిప్ శిథిలాలు చూసేందుకు పరిశోధకులు, పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఒక షిప్ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా సముద్రపు అడుగుకు వెళ్లే సబ్మెర్సిబుల్ బోటులు నిర్వహిస్తున్నారు. ఔత్సాహిక పర్యాటకులను వాటిలో సముద్రం దిగువకు తీసుకెళ్తున్నారు. టైటానిక్ షిప్ శిథాలాలను చూపుతున్నారు.
మరోవైపు, ఈ ఏడాది ఫిబ్రవరిలో అక్కడకు వెళ్లిన సందర్శకులు టైటానిక్ శిథిలాలకు సంబంధించిన 80 నిమిషాల నిడివి ఉన్న వీడియోను యూట్యూబ్లో రిలీజ్ చేశారు. అలాగే మే నెలలో చాలా స్పష్టంగా ఉన్న టైటానిక్ షిప్ శిథిలాల త్రీడీ ఫొటోలను ప్రచురించారు. డీప్ సీ మ్యాపింగ్ సాంకేతిక ద్వారా ఈ త్రీడీ ఫొటోలను రూపొందించారు.