బాల్టిమోర్: అమెరికాలోని బాల్టిమోర్(Balitmore Bridge) పోర్టు నుంచి బయలుదేరిన దాలీ సరుకు రవాణా నౌక.. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ను ఢీకొన్న విషయం తెలిసిందే. అయితే ఆ ప్రమాదం జరగడానికి గత కారణాలను అధికారులు అన్వేషిస్తున్నారు. బాల్టిమోర్ నుంచి శ్రీలంకకు 27 రోజుల్లో వెళ్లేందుకు ఆ నౌక రాత్రి 12.30 నిమిషాలకు పోర్టు నుంచి బయలుదేరింది. బయలుదేరిన కొన్ని క్షణాలకే ఆ నౌకలో పవర్ పోయింది. దీంతో సడెన్గా ఆ నౌక స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. ఆ తర్వాత నౌకలో ఉన్న లైట్లు కూడా పోవడంతో పూర్తి అంధకారం ఏర్పడింది. నౌకలో ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏవీ పనిచేయలేదు. ఇంజిన్ పవర్ శూన్యంగా మారింది. లంగర్కు లేకపోవడంతో.. ఆ నీటిలో అది ముందుకు కదులుతూ వెళ్లింది. పవర్ లేకపోవడం వల్ల దాన్ని ఆపడం కూడా అసాధ్యమైంది.
సమస్యను పరిష్కరించేందుకు నౌకలో ఉన్న సిబ్బంది రకరకాల ప్రయత్నాలు చేశారు. పలుమార్లు అలారమ్ మోగించారు. కానీ ప్రయోజనం లేకుండాపోయింది. మళ్లీ నౌకను పోర్టుకు తీసుకువెళ్లేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. నౌకలో ఉన్న ఎమర్జెన్సీ జనరేటర్ను స్టార్ట్ చేశారు. కానీ షిప్లో ఉన్న ఇంజిన్లు మళ్లీ స్టార్ట్ కాలేదు. ఆ సమయంలో నౌక పైలెట్లకు ఎటువంటి ఆలోచన తోచలేదు. ఆ తర్వాత మేడే కాల్ చేశారు. ప్రమాదం పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చారు. బ్రిడ్జ్ను నౌక ఢీకొనే అవకాశం ఉందని హెచ్చరికలు చేశారు. స్టీరింగ్ తప్పిన షిప్ .. బ్రిడ్జ్ దిశగా దూసుకువస్తున్నట్లు ఓ ట్రాన్స్పోర్ట్ అధికారి ప్రకటించారు.
బ్రిడ్జ్పై ట్రాఫిక్ను ఆపేందుకు ప్రయత్నించారు. వార్నింగ్ ఇవ్వడం వల్ల బ్రిడ్జ్పై చాలా వరకు వెహికల్ ట్రాఫిక్ను నియంత్రించారు. రెండు నిమిషాల వ్యవధిలోనే ట్రాఫిక్ను ఆపరేశారు. సుమారు 289 మీటర్ల పొడువున్న నౌక.. దాదాపు 2.4 కిలోమీటర్ల పొడుగు ఉన్న బ్రిడ్జ్ కాంక్రీట్ను ఢీకొన్నది. బలంగా నౌక ఢీకొనడంతో.. ఆ బ్రిడ్జ్ వెంటనే కూలిపోయింది. ఒక్కొక్క ముక్క విరిగిపడింది. పటాప్సో నదిపై ఉన్న వంతెన ఒక్కసారి కూలిపడింది. ఆ బ్రిడ్జ్పై పనిచేస్తున్న రిపేర్ సిబ్బందిలో ఆరుగురు అదృశ్యమయ్యారు.
సుమారు 47 ఏళ్ల క్రితం బాల్టిమోర్ బ్రిడ్జ్ను ఓపెన్ చేశారు. సుమారు 30 వేల మంది స్థానికులు ప్రతి రోజు తమ పనుల నిమిత్తిం ఆ బ్రిడ్జ్ దాటుతారు. కూలిన బ్రిడ్జ్ వద్దే మూడు వేల కంటేనర్లతో ఉన్న నౌక అక్కడే నిలిచిపోయింది. మేరీల్యాండ్ పోర్టు నుంచి గత ఏడాది దాదాపు ఏడున్నర లక్షల వాహనాలు వెళ్లాయి. ఆ పోర్టుపై సుమారు 15 వేల మంది ఉద్యోగులు ఆధారపడి ఉన్నారని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. నౌకలో సిబ్బంది ట్రాన్స్పోర్టు అధికారుల్ని హెచ్చరించడం వల్ల భారీ విపత్తు తప్పినట్లు ఆయన పేర్కొన్నారు.