బీజింగ్: ఒకటీ రెండు కాదు.. ఏకంగా రూ.2 లక్షల కోట్లు(2700 కోట్ల డాలర్లు). ఐదు, పదేళ్లు కాదు.. కేవలం ఒకే ఒక్క ఏడాది.. చైనాకు చెందిన కొలిన్ హువాంగ్ అనే కుబేరుడు ఈ ఏడాది కోల్పోయిన సంపది ఇది. ప్రముఖ ఇ-కామర్స్ పిన్డుయోడుయో ఐఎన్సీ సంస్థ అధినేత అయిన హువాంగ్.. ప్రపంచంలో ఏ కుబేరుడూ కోల్పోనంత సంపదను కోల్పోయినట్లు బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించింది. ఇంటర్నెట్ కంపెనీలపై చైనా కఠినంగా వ్యవహరిస్తుండటమే దీనికి కారణం. ఈ ఆంక్షల కారణంగా చైనాకే చెందిన ఎవర్గ్రాండ్ గ్రూప్ చైర్మన్ హుయి కా యాన్ కూడా 1600 కోట్ల డాలర్ల సంపద కోల్పోయారు.
ఏం జరిగింది?
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ ఇటీవల తీసుకున్న నిర్ణయమే ఈ కుబేరులు ఇంత భారీ మొత్తంలో సంపదను కోల్పోవడానికి కారణమైంది. చైనాలో ధనిక, పేద మధ్య ఉన్న భారీ అంతరాన్ని తగ్గించే దిశగా దేశంలోని ప్రైవేట్ కంపెనీలపై జిన్పింగ్ ఆంక్షలు విధించారు. తమ లాభాల్లో మెజార్టీ వాటాను దాతృత్వానికే ఖర్చు చేయాలన్నది ఈ ఆంక్షల సారాంశం. దీంతో పిన్డుయోడుయో లేదా పీడీడీ షేర్లు భారీగా పతనమయ్యాయి. అలీబాబా, టెన్సెంట్ హోల్డింగ్స్ సంస్థల కంటే కూడా ఎక్కువగా పీడీడీ సంస్థ నష్టాలను చవిచూసింది.
2015లో హువాంగ్ ఈ పీడీడీ సంస్థను ప్రారంభించారు. ఆ తర్వాత క్రమంగా దీనిని ఇ-కామర్స్ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఈ సంస్థ వార్షిక యూజర్ల సంఖ్య 78.8 కోట్లు కావడం విశేషం. అలీబాబాకు 77.9 కోట్లు మాత్రమే ఉన్నారు. ఈ సంస్థలో హువాంగ్కు 28 శాతం వాటా ఉంది.
టాప్కు దూసుకెళ్లి..
ఒక దశలో ఈ సంస్థ మార్కెట్ విలువ 17800 కోట్ల డాలర్లు (సుమారు రూ.13 లక్షల కోట్లు)కు చేరింది. ఆ తర్వాత అది 12500 కోట్ల డాలర్లకు పడిపోయింది. ఓ పబ్లిక్ కంపెనీగా గత నెలలో తొలిసారి లాభాలను ఈ సంస్థ ప్రకటించింది. ప్రస్తుతం హువాంగ్ సంపద విలువ 3500 కోట్ల డాలర్లు (సుమారు రూ.2.57 లక్షల కోట్లు)గా ఉంది. ఈయన గతేడాది సంస్థ సీఈవీఓ పదవికి, ఈ ఏడాది మార్చిలో చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. చైనా అధ్యక్షుడి ఆదేశాల ప్రకారం.. తాము దాతృత్వానికి భారీగా కేటాయిస్తున్నట్లు ఈ సంస్థ చెబుతోంది. గత నెలలో దేశంలో వ్యవసాయ అభివృద్ధి కోసం 1500 కోట్ల డాలర్లు ఇచ్చింది. గతేడాది మరో చారిటబుల్ ట్రస్ట్కు కూడా 2400 కోట్ల డాలర్లు వితరణగా ఇవ్వడం విశేషం.