వాషింగ్టన్, ఫిబ్రవరి 15: ఉద్యోగాల కోసం అమెరికాకు వలస వెళ్లిన విదేశీయుల పిల్లలకు ఆ దేశం శుభవార్త చెప్పింది. 21 ఏండ్ల వయసు దాటిన వారికి అమెరికాలో స్థిర నివాసం కోసం దరఖాస్తు చేసుకొనేందుకు వెసులుబాటు కల్పిస్తూ యూఎస్ సిటిజెన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) కీలక నిర్ణయం తీసుకొన్నది. సాధారణంగా అమెరికాకు వలసవెళ్లే విదేశీయులకు చిన్నపిల్లలు ఉంటే, పేరెంట్ అప్లికేషన్పై వారు ఆ దేశంలో ఉండేందుకు అవకాశం ఉన్నది. ఆ పిల్లలకు 21 ఏండ్లు వచ్చేవరకే ఆ అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వారికి అమెరికాలో నివసించేందుకు అర్హత ఉండదు.
అందువల్ల పిల్లలకు 21 ఏండ్లు నిండకముందే అమెరికాలో ఉద్యోగాల కోసం లేదంటే స్థిర నివాసం కోసం వారు దరఖాస్తులు చేసుకొంటారు. ఆ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించకముందే 21 ఏండ్లు దాటితే వారిని అక్రమ వలసదారులుగా భావించేవారు. తాజాగా ప్రభుత్వం ఈ విధానాన్ని మార్చి దరఖాస్తు చేసుకొన్నప్పటి నుంచి వయసును లెక్కించాలని నిర్ణయించింది. అంటే పిల్లలకు 18 ఏండ్లు ఉన్నప్పుడు స్థిర నివాసం కోసం దరఖాస్తు చేసుకొంటే, ఇప్పటివరకు ఆ దరఖాస్తు పెండింగ్లో ఉంటే.. వారికి మరో మూడేండ్లు అమెరికాలోనే తల్లిదండ్రులతో ఉండేందుకు అవకాశం కల్పిస్తారు. ఆలోపు దరఖాస్తులను పరిష్కరించే ప్రయత్నం చేస్తారు.