లండన్: గ్లోబల్ వార్మింగ్ కారణమైన గ్రీన్ హౌస్ వాయువుల్లో ప్రధానమైనది కార్బన్ డై ఆక్సైడ్. గాలిలో దీని గాఢత పెరిగే కొద్దీ ఉష్ణోగ్రతలు పెరిగి భూమి వేడెక్కుతుంది. దీంతో వాతావరణంలో కార్బన్ డై ఆక్సైడ్ తగ్గించడం ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలకు సవాల్గా మారింది. అయితే, వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్కు చెక్పెట్టేందుకు బ్రిటన్ కొత్త అస్ర్తాన్ని సిద్ధం చేస్తున్నది. వాతావరణంలోని కార్బన్ను బంధించి నార్త్ సీలో నిల్వ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. గ్రీన్హౌస్ ఉద్గారాలను తగ్గించేందుకు ‘కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్’ అనేది ప్రభావవంతమైన పద్ధతి అని బ్రిటన్ విశ్వసిస్తున్నది. యూకే వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ స్థాయిలను తగ్గించేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ 20 బిలియన్ డాలర్ల పెట్టుబడితో రెండు కార్బన్ క్యాప్చర్, స్టోరేజీ సౌకర్యాలను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ టెక్నాలజీ ఇంకా నిరూపితం కాలేదని, ఎంతమేర కర్బన ఉద్గారాలను నిల్వ చేయవచ్చో తెలియదని ప్రతిపక్షం వాదిస్తున్నది.
కార్బన్ క్యాప్చర్ అండ్ స్టోరేజ్ (సీసీఎస్) వాతావరణంలోని కార్బన్ను పెద్ద మొత్తంలో సంగ్రహించి, గ్లోబల్ వార్మింగ్తో పోరాటంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ విధానంలో వాతావరణంలోని కార్బన్ డై ఆక్సైడ్ను సంగ్రహించి, భూగర్భంలో శాశ్వతంగా నిల్వ చేస్తారు. బ్రిటన్ ప్రభుత్వం ప్రకారం సీసీఎస్ ప్లాంట్లో 78 బిలియన్ టన్నుల కార్బన్ను నిల్వ చేయవచ్చు. ఇది 15 బిలియన్ల ఏనుగుల బరువుతో సమానం.
భారీ పరిశ్రమల వద్ద ఏర్పాటు చేసిన సీసీఎస్ వ్యవస్థ కార్బన్ డై ఆక్సైడ్ను గ్రహిస్తుంది. ఈ వ్యవస్థలో ఉండే లోహపు ఎయిర్ స్క్రబ్బర్లు సీవో2ను పీల్చుకోగా, కెమికల్ ఫిల్టర్ ద్వారా సంగ్రహిస్తారు. అనంతరం ఆ కర్బన ఉద్గారాన్ని పైప్లైన్ల ద్వారా స్టోరేజీ సైట్కు పంపిస్తారు. ఒకవేళ అది దూరంలో ఉన్నైట్టెతే వాహనాలు, షిప్పుల్లో అక్కడికి తరలిస్తారు. స్టోరేజీ సైట్ సముద్ర అంతర్భాగంలో ఆయిల్ లేదా గ్యాస్ రిజర్వాయర్ తరహాలో ఉంటుంది. ఇది పోరస్ శిలలతోకూడి ఉండి వాయువును స్టోరేజీ చేసుకొనే సామర్థ్యం కలిగి ఉంటుంది. దీనిని ‘స్లైన్ ఆక్విఫర్’ అంటారు. కార్బన్ డై ఆక్సైడ్ అక్కడే శాశ్వతంగా ఉండిపోతుంది. స్టోరేజీ సైట్లో లీకులు లేకుండా జాగ్రత్తలు తీసుకొంటారు. కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ అండ్ స్టోరేజీ (సీసీయూఎస్) అనే మరో విధానం కూడా అందుబాటులో ఉంది. ఇందులో కార్బన్ డై ఆక్సైడ్ను పునర్వినియోగించి ప్లాస్టిక్, కాంక్రీట్, బయో ఇంధనాలను తయారుచేస్తారు.
ప్రభుత్వాలు పునరుత్పాదక ఇంధనాలకు మారకుండా ఈ సీసీఎస్ విధానంతో పర్యావరణానికి తీవ్రహాని చేసే శిలాజ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ సముద్ర గర్భంలో నిల్వ ఉంచిన కార్బన్ డై ఆక్సైడ్ లీక్ అయితే నీరు కలుషితం అవుతుందని, ఇది సముద్ర జీవులకు చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.