శాన్ఫ్రాన్సిస్కో/న్యూయార్క్, నవంబర్ 11: ట్విట్టర్లో బ్లూటిక్ సబ్స్క్రిప్షన్ నిలిపివేస్తూ సంస్థ ఆకస్మిక నిర్ణయం తీసుకొన్నది. కొందరు ఫేక్ అకౌంట్లు సృష్టించి, 8 డాలర్లు చెల్లించి వెరిఫైడ్ బ్లూ టిక్ను సొంతం చేసుకొన్నారు. ఆ ఫేక్ అకౌంట్లలో కీలక వ్యక్తుల ఫొటోలతో తప్పుడు సమాచారాన్ని ట్వీట్ చేశారు. దీంతో ఎవరిది అసలైన అకౌంట్, ఎవరిది ఫేక్ అకౌంట్ అన్నది గుర్తించటం సాధ్యం కాలేదు. దీంతో ట్విట్టర్ యాజమాన్యం అసలు వ్యక్తులకు క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. పరిస్థితి చేయి దాటిపోతున్నదని గుర్తించి, బ్లూ టిక్ సబ్స్క్రిప్షన్ను నిలిపివేసింది.
ఉద్యోగులకు మస్క్ షాక్
ట్విట్టర్ను సొంతం చేసుకున్న ఎలాన్ మస్క్ ఉద్యోగులకు షాక్ మీద షాక్ ఇస్తున్నాడు. ట్విట్టర్కు మరింత ఆదాయాన్ని సృష్టించడంలో ఉద్యోగులు విఫలమైతే కంపెనీ దివాలా తీయవచ్చని హెచ్చరించాడు. దీని నుంచి బయట పడాలంటే ఉద్యోగులు మరింత కష్టపడాలని తెగేసి చెప్పాడు. వర్క్ ఫ్రం హోం విధానానికి స్వస్తి పలికి వారానికి 80 గంటలు పనిచేయాలని, కంపెనీ నుంచి ఉచితంగా పొందే ఆహారంతోపాటు ఇతర చిన్న చిన్న ప్రయోజనాలను వదులుకొనేందుకు సైతం ఉద్యోగులు సిద్ధపడాలని తేల్చిచెప్పారు.
కీలక ఎగ్జిక్యూటివ్లు గుడ్బై
మస్క్ కొత్త నాయకత్వ బృందంలోని కీలక పదవుల్లో ఉన్న పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్లు స్వచ్ఛందంగా కంపెనీ నుంచి వైదొలుగుతున్నారు. దీంతో వందల కోట్ల డాలర్ల జరిమానాల రూపంలో ట్విట్టర్కు తీవ్రమైన ముప్పు పొంచి ఉన్నదని ఆ కంపెనీ లాయర్ తెలిపాడు. ఈ నేపథ్యంలో రాబిన్ వీలర్ లాంటి కొందరు కీలక ఎగ్జిక్యూటివ్లను ఉద్యోగాల్లో కొనసాగేలా ఒప్పించేందుకు మస్క్ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తున్నది. కాగా, మస్క్ టేకోవర్ చేసిన తర్వాత ట్విట్టర్లో జాత్యహంకార పోస్టులు నానాటికీ అధికమవుతున్నట్టు డిజిటల్ పౌర హక్కుల గ్రూపు సీసీడీహెచ్ వెల్లడించింది.