Pakistan Elections | ఇస్లామాబాద్, ఫిబ్రవరి 11: పాకిస్థాన్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు ఆదివారం వెలువడ్డాయి. వీటిని పరిశీలిస్తే దేశంలో సంకీర్ణ ప్రభుత్వం తప్పనిసరిలా కన్పిస్తున్నది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు పార్టీలు చకచకా పావులు కదుపుతున్నాయి. మరో పక్క పలుచోట్ల ఎన్నికల ఫలితాలను సవాల్ చేస్తూ పీటీఐ మద్దతుదారులు కోర్టుల్లో కేసులు దాఖలు చేశారు. పీటీఐ మద్దతుదారులు అధిక సంఖ్యలో విజయం సాధించినప్పటికీ ఫలితాలల్లో తీవ్ర అవకతవకలకు పాల్పడ్డారంటూ పీటీఐ ఆరోపించింది. కాగా, ఫలితాల అనంతరం సాంకేతికంగా అతి పెద్ద పార్టీగా నిలిచి, ఆర్మీ మద్దతు ఉన్న నవాజ్ షరీఫ్ ముందంజలో ఉన్నారు. 266 మంతి సభ్యుల జాతీయ అసెంబ్లీలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
అందులో 264 స్థానాల ఫలితాలు వెల్లడి కాగా, ఒక ఫలితాన్ని నిలిపివేశారు. ఈ ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పీటీఐ మద్దతుతో ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన 101 మంది విజయం సాధించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్కు చెందిన పీఎంఎల్-ఎన్ 75, బిల్వాల్ జర్దారి భుట్టోకు చెందిన పీపీపీ 54 సీట్లు గెల్చుకున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 133. ఈ నేపథ్యంలో పీపీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్-ఎన్ జోరుగా మంతనాలు సాగిస్తున్నది. నవాజ్కు అనుకూలంగా పాక్ సైన్యాధ్యక్షుడు ఆసీమ్ మునీర్ కూడా రంగంలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.