Nobel Peace Prize | ఓస్లో, అక్టోబర్ 6: ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి పురస్కారం ఈ ఏడాది ఇరాన్కు చెందిన మానవహక్కుల కార్యకర్త నర్గీస్ మొహమ్మదీని వరించింది. ఇరాన్లో మహిళల అణిచివేతకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటాన్ని గుర్తిస్తూ ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్టు నార్వే నోబెల్ కమిటీ చైర్పర్సన్ బెరిట్ రెయిస్-ఆండర్సన్ శుక్రవారం ఓస్లోలో ప్రకటించారు. నోబెల్ శాంతి పురస్కారాన్ని గెలుచుకున్న మహిళల్లో మొహమ్మదీ 19వ వారు. మానవహక్కుల కార్యకర్త షిరిన్ ఎబాదీ (2003) తర్వాత ఇరాన్ మహిళను నోబెల్ శాంతి పురస్కారం వరించడం ఇది రెండోసారి. ఈ పురస్కారం కింద మొహమ్మదీకి 110 లక్షల స్వీడిష్ క్రోనార్ల (దాదాపు రూ.8.32 కోట్ల) నగదు బహుమతితోపాటు 18 క్యారెట్ల బంగారు పతకాన్ని, ఓ డిప్లొమాను అందజేయనున్నారు. డిసెంబర్లో ఈ పురస్కార ప్రదానం జరుగుతుంది. సంప్రదాయం పేరిట మహిళలకు సవాలక్ష ఆంక్షలు విధించే ఇరాన్లో మొహమ్మదీ విద్యార్థి దశ నుంచే మహిళా హక్కులపై గళమెత్తారు. ఇంజినీరింగ్ పూర్తిచేశాక కొంత కాలంపాటు పలు వార్తాపత్రికలకు కాలమిస్ట్గా పనిచేసిన మొహమ్మదీ.. 2003లో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిరిన్ ఎబాదీ స్థాపించిన ‘డిఫెండర్స్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (డీహెచ్ఆర్సీ)లో చేరారు. ఆ తర్వాత అదే సంస్థలో ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.
మానవహక్కుల కోసం అలుపెరుగకుండా పోరాడుతున్న మొహమ్మదీకి ఎన్నోసార్లు కఠిన సవాళ్లు ఎదురైనా ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఈ క్రమంలో ఆమె 13 సార్లు అరెస్టవడంతోపాటు 31 ఏండ్లు జైలుశిక్షకు గురయ్యారు. ఇరాన్ ప్రభుత్వాన్ని విమర్శించినందుకు 1998లో తొలిసారి అరెస్టయిన మొహమ్మదీ.. ఆ తర్వాత డీహెచ్ఆర్సీలో చేరినందుకు మరోసారి అరెస్టయ్యారు. జాతి విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారన్న అభియోగంతో 2011లో ఆమెను మరోసారి అరెస్టుచేసి 11 ఏండ్ల జైలుశిక్ష విధించారు. ఆ తర్వాత బెయిల్పై విడుదలైన మొహమ్మదీ.. ఇరాన్లో విచ్చలవిడిగా అమలు చేస్తున్న మరణశిక్షలకు వ్యతిరేకంగా పోరాటం చేపట్టారు. దీంతో 2015లో ఆమెను మరోసారి అరెస్టుచేసి, జైలుకు పంపారు.
ఇరాన్లో రాజకీయ ఖైదీలపై, ప్రత్యేకించి మహిళలపై జరుగుతున్న లైంగిక హింసకు వ్యతిరేకంగా జైలులోనే ఉద్యమాన్ని ప్రారంభించిన మొహమ్మదీకి అక్కడ కూడా ఎంతో మంది మద్దతు తెలిపారు. దీంతో జైలు అధికారులు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ ఆమె తన పోరాటాన్ని ఆపలేదు. హిజాబ్ను ధరించనందుకు నిరుడు ఇరాన్ పోలీసులు మాసా అమీని అనే యువతిని అరెస్టు చేయడంతో కస్టడీలో తీవ్రంగా గాయపడి ఆమె మరణించింది. దీంతో అక్కడ ఉవ్వెత్తున ఆందోళనలు జరిగాయి. వీటిని అణచివేసేందుకు పోలీసులు చేపట్టిన చర్యల్లో 500 మందికిపైగా మరణించడంతోపాటు 22 వేల మందికిపైగా అరెస్టయ్యారు. ఆ సమయంలోనూ మొహమ్మదీ తన గళాన్ని వినిపించారు. జైలులో ఎన్ని కఠిన ఆంక్షలు ఉన్నప్పటికీ అక్కడి నుంచే సంచలన కథనాలను రాసి పలు అంతర్జాతీయ పత్రికలకు పంపారు. అవి బీబీసీ, న్యూయార్క్ టైమ్స్ లాంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. వీటితోపాటు ఇరాన్ జైళ్లలో మహిళలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులను కండ్లకు కడుతూ ‘వైట్ టార్చర్: ఇన్సైడ్ ఇరాన్ ప్రిజన్స్ ఫర్ ఉమెన్’ పేరిట పుస్తక రూపంలో బాహ్య ప్రపంచానికి తెలియజేసిన మొహమ్మదీ ఇప్పటికీ జైలులోనే ఉన్నారు.